Monday, December 31, 2012

నల్ల బియ్యం పాకం..!!

పెపంచికం లో అదృష్టమున్న అందరికీ తినడానికి తిండి దొరుకుతుంది.
దంతసిరి ఉన్న ప్రతి ఒక్కరికీ రుచికరమైన ఫుడ్డు దొరుకుతుంది.
చేతులు దురదెక్కిన ప్రతి తింగరి జీవికీ వండిపెట్టే అవకాశం వరిస్తుంది.
గతి లేని ప్రతి దరిద్రుడికీ అది తినాల్సిన దౌర్భాగ్యం దాపురిస్తుంది.

ఇలాంటి సిల్లీ స్టేట్మెంట్లని దిగంబర సత్యాలు గా ప్రవచించడానికి నేను ధైర్యం చెయ్యడానికి గల కారణాలూ, అనుభవాలూ, అనర్ధాలూ, అవస్థలూ,అగచాట్లూ, అఘాయిత్యాలూ, ఆక్రందనలూ (ఫ్లో బాగుంది కదా అని వాడా) మీకు చెప్పి నాలాంటి వాళ్ళతో కలిసిపోడానికీ, నాలాంటి వాళ్ళని నాతో కలుపుకుపోడానికే ఈ ఊకదంపుడు ఉపోధ్ఘాతం.

పీజీల్లో పెట్టే ఉడికీ ఉడకని, రుచీ పచీ లేని గడ్డి తినలేనని నా నాలుక నిరాహార దీక్ష మొదలెట్టిన దినములు అవి.
ఆంధ్రా మెస్సుల్లోనూ, కర్ణాటకా రెస్టారెంట్లలోనూ తిన్న తిండి కడుపు లో కల్లోలం సృష్టిస్తుండటంతో ఆ బాధ, నాలోనూ ఒక గద లేని భీముడు మడిగట్టుకొని కూర్చున్నాడనీ, వాడికి చాన్సిస్తే తొడగొట్టి తాళింపు పెట్టగలడనీ  గుర్తు చేసింది. రూం తీసుకొని మన వంట మనమే చేసుకుతిందాం అన్న ఐడియాని ప్రతిపాదించాను నా ఫ్రెండ్స్ దగ్గర.

"అమ్మో... వంటా...?? పాతికేళ్ళు గా తినటం, తిన్నది అరాయించుకోవటం నేర్చుకున్నాం గానీ వండటం మన వల్ల అవుతాదంటావా? ?"......... అనుమానం వ్యక్తం చేశాడు మనోజ్ గాడు.

"మగాడు వంట చెయ్యడం అనేది అందరూ చూస్తుండగా నూడుల్స్ తినడం లాంటిదిరా.. తినేవాడికి బానే ఉంటాదేమో గానీ చూసేవాడికి చండాలంగా ఉంటాది. అది ఆడాళ్ళు ఇంట్లో  చేసి అంట్లు కడగాలి. మగాళ్ళు హోటల్లో చేసి నోట్లు లెక్కెట్టాలి".......... తేల్చి చెప్పేశాడు సుధాకర్ గాడు.

అప్పటికి ఆరేళ్ళబట్టీ పెనం-దోసా-అట్లకాడల్లా క్లోజ్ ఫ్రెండ్షిప్ మాది. మా వాళ్ళ ఉద్దేశ్యాలని కొట్టి పారెయ్యలేను. నా చుట్టూ సందేహాలు జోరీగల్లా మూగాయి.
అంటే పురుషులు తినడానికే గానీ వండటానికి పనికి రారా?? అది ఆడోళ్ల సొత్తా?
ఏం??? వంట చేతగాని వయ్యారులు లేరా? పాకశాస్త్రం లో పండిపోయిన పురుషాధములు...ఆఆఆఅ సారీ.... పురుషాగ్రేసురులు లేరా?? తెలియాలంటే నా గతం మీకు చెప్పాల్సిందే.
ఈ పిక్చర్ లో సెంటర్ పాయింట్ ని చూస్తూ... మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చేయండి...


************************************************************************************
నాకు పెసరట్టంటే ఎంతిష్టమో మీ అందరికీ తెలుసన్న సంగతి నాకు తెలుసు. అట్టు కంటే ముందు నా మనసు దోచుకున్న పదార్ధం ఉప్మా అనీ, అసలు పెసరట్టు ని అంతిష్టపడటానికి సగం కారణం ఈ ఉప్మానే అనీ, ఆ సంగతి పదినిమిషాల క్రితమే తెలిసిందనీ మొహమాటం లేకుండా సిగ్గుపడుతూ మీకు చెప్పడానికి గర్వపడుతున్నాను.
నన్ను స్కూళ్ళో పడేసి మా అమ్మ చేతులు దులుపేసుకొని మనఃశ్శాంతిని పొందడానికి ముందు, మా తాతయ్య తో పాటూ సైకిల్ మీద రోజూ స్కూల్ కి వెళ్ళేవోడిని గంట లేట్ గా. "అంత లేటెందుకు అయ్యేదీ?" అని అడుగుతారేమో. అమ్మమ్మ వంట పూర్తయ్యేదాకా మా కిరాణా షాప్ తాతయ్యే చూసుకునేవాడు. ఆ తర్వాత తొమ్మిదింటికి మా తాత స్నానం చేసి, నుదుట మీద శోభన్ బాబు రింగు తీసీ, మొహానికి పాండ్స్ పౌడరూ, కాష్మీర్ స్నో కలిపి కొట్టి, తెల్ల చొక్కాకి పిఠాపురం నూర్జహాన్ సెంట్ పక్కనున్నోడు మొహంతిరిగి పడిపోయే రేంజ్ లో అంటించి, నల్లకళ్ళద్దాలు పెట్టి పూలరంగడి లా తయారయ్యేసరికి ఆ మాత్రం లేటయ్యేది. స్కూల్ కెళ్ళే సరికి ఇంటర్వెల్ లో పెట్టే "గోధుమ నూక ఉప్మా" కోసం పిల్లకాయలంతా బొడ్డాకులు కోన్ షేప్ లో కుట్టుకొని రెడీ గా ఉండేవారు.ఆ వంట చేసే ముసలావిడ నాకోసం ప్రత్యేకంగా ఒక డబ్బాతో ఉప్మా తెచ్చి పెడితే ఒక చెక్క పెట్టె మీద కూర్చొని సగం తింటూ, సగం చుట్టూ జల్లేస్తూ తన్మయత్వం తో అలౌకికానందాన్ని పొందుతూ ఉండేవాడిని. అదిగో అలా ఉప్మాకి దాసుడనయ్యేను. ఆ తర్వాత రోజూ ఉప్మా చేసిపెట్టమని మా మాతని యాతన పెట్టడం మొదలెట్టేను.

ఓ రోజు అమ్మకి జొరమొచ్చింది. ఆరోజు దాకా ఉల్లిపాయలు,మిరగాయలూ సన్నగా, ఓపిగ్గా తరగడానికి  మాత్రమే పరిమితమైన మా నాన్నకి వంట చేసే చాన్సొచ్చింది. ఇప్పుడంటే 2 నిమిషాల్లో మ్యాగీ రెడీ అంటున్నారు గానీ, అంతకు ముందు తొందరగా సింపుల్ గా అయిపోయే టిఫినీ ఉప్మానే నాకు తెలిసి. సో... ఇదే ఆలోచనతో నాన్న లుంగీ సగానికి మడతెట్టి సమాయత్తమయ్యాడు. "అబ్బాయిలూ... ఈ రోజు నల భీమ పాకం రుచి చూద్దురూ గానీ" అనేసి వంట గదిలోకి దూరిపోయాడు. "నల్ల బియ్యం పాకం అంటే ఏటమ్మా? అది కూడా తియ్యగానే ఉంటాదా?" అని కొండంత ఆశతో అడిగాను అమ్మని. "ఓరి నా నత్తి పకోడీ పుత్రా... అది నల భీమ పాకం రా...నేను వండాననుకో...దాన్ని వంట అంటారు, మీరు తింటారు. అదే మీ నాన్న చేశాడనుకో దాన్ని నల భీమ పాకం అంటారు. అది తినగలిగేలా ఉంటే తింటారు" అని నాకర్ధమ్ కాని రిప్లై నాన్నకి వినపడేలా చెప్పింది అమ్మ.

గంట తర్వాత ఉప్మా తీసుకొచ్చి నాకూ తమ్ముడికీ పెట్టి సైలెంట్ గా జారుకున్నాడు నాన్న. రెండు స్పూన్లు అతికష్టం మీద తిని ఇంక తినలేనని అమ్మకి కంప్లెయింట్ చేయడం తో కొంచెం నోట్లో వేసుకొని రుచి చూసి, కళ్ళు, ముక్కు పెద్దవి చేసి నొసలు చిట్లించింది.
"ఉప్మా కరాచీ నూకతో చేస్తారు... ఉప్పు తో కాదు. ఎన్ని చెంచాలేశారు ఇందులో?? "
నోరు తెరిచి మాట్లాడకుండా....సీరియస్ గా చెయ్యెత్తి నాలుగేళ్ళు చూపించారు నాన్నారు.
 "నా....లుగు చెంచాలా? నూక కలిపే ముందే చూసుకోవద్దా?"
"ఎసరు రుచి చూశాను...అప్పుడు సరిపోయింది... నూక కలిపాక సరిపోదేమోనని డౌటొచ్చి.. ఇంకో రెండు చెంచాలేశాను"........ అమాయకత్వం తో కూడిన పితృదేవుల రిప్లై.
అంత నీరసం లోనూ "ఏడిసినట్టుంది..." అని అరిచేసీ, ఉప్మా లో పెరుగు కలుపుకొని తినెయ్యమని అమ్మ అద్బుతమైన ఐడియా ఇవ్వటం తో నా జీర్ణాశయం శాంతించిందీ...  మా ఇంట ప్రశాంతత తాండవించింది.

**************************************************************************************
"చేపల పులుసెట్టాలన్నా, గుత్తొంకాయ కూరొండాలన్నా నీ తర్వాతే అక్కా..."  అని లొట్టలేస్తూ నాన్న పొగిడేస్తుంటే, కట్టించుకున్న ముందుపళ్ళు కాంతులు వెదజల్లేట్టూ నవ్వేసి మరి కొంచెం వడ్డించే మా అమ్మమ్మని చూసీ "వంట అనేది అమ్మో, అమ్మమ్మో చెయ్యాలీ... నేనూ, నాన్నా, తాతయ్యా తినాలీ" అని నా పసి హృదయం మీద నట్రాజ్ పెన్సిల్ తో రాసుకున్న రాతల్ని, నాన్ డస్ట్ ఎరేజర్ లాంటి వేయించిన చికెన్ ముక్కల్తో చెరిపేశాడు మా తాతయ్య.

సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళినప్పుడూ.. అప్పుడప్పుడూ మా తాత, అమ్మమ్మ కబంధ హస్తాలనుండి వంటగది ని స్వాధీనపరుచుకొని కోడికూర వండేవాడు. అది ఎంత అద్బుతం గా ఉండేదీ అంటే... నేనూ, మా చిన్నమాయా కూర దాక పక్కనెట్టుకొని నాకేసేవాళ్ళం. "నాన్న చికెన్ వండితే... పీస్ నోట్లో పెట్టగానే కరిగిపోతుంది..ఎలా చేస్తాడో ఎవరికీ తెలీదు" అని మా చిన్నపిన్ని పొగుడుతుంటే... మా అమ్మమ్మ మాత్రం "మరికొంత నూనేసి, అంత జీడిపప్పేసి వేపితే రుసిగా ఉండదా మరీ..? రెండు గిన్నెల తో పోయేదానికి పది గిన్నెలకి అంటిస్తాడు. వంటగదంతా వరద చేసి పారేస్తాడు.. అంట్లు తోమలేక నడుం పడిపోతుంది. " అని తనదైన శైలి లో విరుచుకుపడేది. "కూర బాగుందా తాతా....? మీ మామ్మ అలాగే అంటాది. నేను బాగా వండానని కుళ్ళు దానికి. అన్నీ అమ్మ బుద్ధులే. కంచం లో భోజనం పెట్టినపుడు, పక్కన గ్లాసు తో మంచినీళ్ళెట్టాలని కూడా తెలీదు ఈ రోజు దాకా.. చారు గిన్నెలో కన్నాల గరిట పెట్టే ఇది కూడా చెప్పెయ్యడమే నాకు " అని దెప్పిపొడుపులు మొదలెట్టేవాడు మా తాత.
నలుడూ, భీముడూ గరిటని గద తిప్పినట్టు తిప్పిన వంటోళ్ళని మా తాత వండిన కూరలు రుచి చూశాకే నమ్మేను నేను.

*************************************************************************************
అందుకే... నా మిత్రబృందం వద్దన్నా గానీ, తాత ఇచ్చిన ఈ ధైర్యమే నేను స్టౌ, సిలిండర్ కొనేలా పురిగొల్పాయి. అమ్మ ఇచ్చిన సలహాలు నా చేత పెనం, ప్రెషర్ కుక్కర్ కొనేలా ప్రోత్సహించాయి. అల్లం వెల్లుల్లి పేస్టులూ, ఎమ్టీఆర్ మసాలా పౌడర్లూ,  కంచాలూ-చెంచాలూ, గిన్నెలూ-గరిటలూ, కత్తిపీట-పట్టకారు, పామాయిలూ - ప్రియా పచ్చళ్ళూ,ధనియాలూ-మిరియలూ నంజుకోడానికి వడియాలూ, పప్పూ- బియ్యం, ఉప్పు - కారం  కొని నా కిచెన్ లో అలంకరించాను. ముచ్చట గా ఉన్న కిచెన్ ని చూసి, పక్కోడు బిల్ కడతానన్నప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్ళి ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందమేసింది. "పోపులంటే ఏంటీ?"అనే బేసిక్ క్వైరీ నుండి మొదలుకొని "బిర్యానీ చెయ్యడం ఎలా?" వరకూ అమ్మ ఫోన్ లో ఇచ్చే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నేను చెయ్యితిరిగిన వంటగాడిగా... కాదు కాదు "కండలు తిరిగిన వంటగాడిగా" రూపాంతరం చెందాను.

అడుగుమాడిన అత్తెసరన్నం, ముక్కలుడకని దుంపల పులుసుల కాంబినేషన్ లో కాలం ఆవిరవుతుండగా....ఏతెంచిన ఒకానొక వారాంతపు దినమది. రాత్రంతా జర్నీ చేసి పొద్దున్నే బస్సు దిగిన నిద్రమొహం లా దరిద్రంగా ఉంది ప్రకృతి.వంట మొదలెడదాం అనుకునేసరికీ కాయగూరల బుట్ట ఖాళీ గా కనిపించింది. బయటకెళ్ళి తెద్దామంటే నాకు చారెడు చాదస్తం, బారెడు బద్దకం కాబట్టీ.. ఆల్టర్నేటివ్ ఏంటా ఆలోచించాను.  మంచింగ్ లేకుండా మందెయ్య లేమూ... కూరగాయలు లేకుండా కూరొండలేము కనుక... ఈ రోజు కి నూడుల్స్ చేసుకుందాం అని డిసైడ్ చేశాను. "ఒట్టి నూడుల్స్ ఏం తింటాం రా.. ఎగ్ నూడుల్స్ చెయ్యి " అని సలహా ఇచ్చాడు సుధాకర్ గాడు. "అదెలాగో నాకు తెలీదు...నువ్వే హ్యాండిల్ చెయ్యి" అన్నాన్నేను. "వెజ్ బిర్యానీలో చికెన్ పీసులేస్తే చికెన్ బిర్యానీ అయినట్టే... మ్యాగీ నూడుల్స్ లో గుడ్డు గిలక్కొట్టేస్తే ఎగ్ నూడుల్స్ అవుతాది... సో.. సింపుల్" అని పండుఒలిచి నోట్లో పెట్టినట్టు వివరించడం తో నేను ప్రిపరేషన్ మొదలెట్టాను. నీళ్ళు  గిన్నెలో పోసాను. నూడుల్స్ అందులో వేశాను. గిన్ని పొయ్యి మీద పెట్టాను. కింద మంటెట్టాను. కాసేపయ్యాక నూడుల్సూ, మసాలా వేసి... "ఇప్పుడేం చెయ్యాల్రా?" అనడిగాను. వాడు సెల్ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుకుంటూ వచ్చి... "ఎగ్స్ అందులో వేసి కలిపెయ్యి.. పెంకులు పారెయ్యి" అన్నాడు.
"ఓస్..ఇంతేనా... " అనుకొని వాడు చెప్పినట్టే వేసి తిప్పడం మొదలెట్టాను...తిప్పాను..తిప్పాను.. తిప్పాను..... ఫైనల్ గా అది ఇలా అయ్యి కూర్చుంది.


 దరిద్రుడు నిద్దరపోతే అలార్మ్ మోగినట్టు కలొచ్చినట్టూ... మన ప్రయోగం ఇలా బెడిసికొట్టిందేంటీ? అనిపించింది.
కష్టపడి చేసుకున్నది... పారేసుకుంటామా? ఆకలి మీద ఉన్నామేమో..."బానే ఉన్నాది" అనిపించి తినేశాం. ;)
********************************************************************************
ఈ బెమ్మీల వంటకాలన్నీ ఇట్టాగే తగలడాతాయి అని మీరు అనుకుంటే చింతపండు లేకుండా చారెట్టినంత దారుణం. పసుపు లేకుండా పులిహోర చేసినంత పాపం. ఆడలేడీసేమీ తక్కువ తినలేదు.
లాస్ట్ ఇయర్ మా రవీంద్ర గాడి పెళ్ళి పుణ్యమా...అని నాలుగేళ్ల తర్వాత మా ఇంజినీరింగ్ క్లాస్మేంట్సందరం అనుకోకుండా కలిశాం. ఇల్లు విశాలం గానూ, వంటకాలు రుచికరం గానూ, పరిమాణం భారీగానూ ఉంటాయని చెప్పి మా ఊళ్ళో నా ఏకైక ఫ్రెండ్ మేరీ వాళ్ళింట్లో గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. అందరం అందర్నీ పలకరించుకుంటూ, పళ్ళు ఇకిలించుకుంటూ ఆనందిస్తున్న గొప్ప సమయం.

నేనుః ఏంటి మేరీ...ఏం సంగతులు? ఆఫీస్ లో వర్క్ బాగా తొక్కేస్తున్నారా?
మేరీః నేను స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్కే మా డాడీ తో చేయించేదాన్ని..ఆఫీస్ లో వర్కెందుకు చేస్తాను చెప్పు? సంగతులు చెప్తాను గానీ... ఎవ్వరికీ చెప్పకూడదు మరి..! ప్రామిస్?
నేనుః "సంగతులు చెప్పమంటే... సీక్రెట్స్ చెప్తున్నావా....సరే ప్రామిస్"
మేరీః "ఆ మధ్య... మార్నింగ్ వాకింగ్ మొదలెట్టాను రాజ్కూ...మా ఇంటి నుండి రామా ధియేటర్ దాకా"
నేనుః "అవునా... హఠాత్తుగా అంత పనెందుకు చేశావు?...ఐనా మంచిదే కదా...కానీ ఇందులో సీక్రెట్ ఏముందీ?"
మేరీః "అంటే...అంత దూరం నడిచేసరికి ముందు ఆయాసమొచ్చింది, తర్వాత నీరసమొచ్చింది, ఈ వాకింగులు మనకి పడవని తెలిసొచ్చింది. అందుకే...రిక్షా కట్టించుకొని ఇంటికి తిరిగొచ్చేశాను"
నేనుః  "(@*$#%&((@#$...."
మేరీః "అది సరే గానీ.... మా పేరెంట్స్ బయటకెళ్ళారు...కాబట్టీ నేనే మీ అందరికీ కాఫీ పెట్టి, నూడుల్స్ చేసి పెడతానేం"
ప్రసాద్ గాడుః ఇప్పుడవన్నీ ఎందుకులే....నీకు శ్రమా.. మాకు రిస్కూ...!
మేరీః తినకుండా వెళతామంటే నేను అరిచి ఊరుకునే టైప్ కాదు. కరిచి ఉసురు తీసే టైప్.
మస్తాన్ గాడు : అదింకా రిస్క్ కదా....నాకసలే ఇంజక్షన్లంటే బయ్యం. ఇంతకీ ఎగ్ నూడుల్సా...చికెన్ నూడుల్సా?"
(నాకు ఎక్కడో కలుక్కుమందీ...ఎగ్ నూడుల్స్ పేరు వినగానే)
మేరీః  "మీ మట్టి మొహాలకి మ్యాగీ నూడుల్సే ఎక్కువరా.."
మనోజ్ గాడుః ఇదిగో...ఇంటికి పిలిచి మమ్మల్ని  ఇలా అవమానించడం ఏం బాలేదు.
మేరీః మరిగిస్తే పాలు పొంగినట్టూ, పారబోస్తే నీళ్ళు పారినట్టూ మీలాంటి డిప్పకాయ ఫేసులు చూస్తే నాకు అలా మాటలు ప్రవాహం లా తన్నుకొచ్చేస్తాయ్.
సత్తిమాయః ఏటి.. మేరీ ఇల్లంతా వెతుకుతున్నావ్... ఏదన్నా కనిపించట్లేదా??
మేరీః మా వంట గది ఎక్కడుందా అని వెతుకుతున్నా...! కనిపించింది ఇప్పుడే...! కాఫీ తెస్తున్నానుండు...!
మనోజ్ గాడు: సత్తి మాయా.. నాకేదో తేడా కొడుతుంది రా...!
కృష్ణబాబుః అమ్మా...శాంభవీ... కప్పు చిన్నదిగా ఉందీ... కాఫీ సగానికే ఉందీ... చిక్కదనం మిస్సయ్యిందీ..!
 మేరీః పాలు పావులీటరే ఉన్నాయి. మీరు పదిమందున్నారు. అందుకే వాటర్ వాల్యూం పెంచీ, కప్పు సైజ్ తగ్గించాను. చండాలంగా నట్టింట్లో ఏడవకు... శని. మీ అందరికీ వేడి వేడి నూడుల్స్  రెడీఈఈఈఈఈఈఈఈఈఈఈ...!

ఆ పదార్ధం వండేటప్పుడు ఇలా కనిపించింది...
 వండాక ఇలా అయ్యిందీ....


తినడానికి ఎలా ఉన్నాదో... నాకు తెలీదు.
తిన్నాక ఏమయ్యిందో మా మస్తాన్ గాడు సిగ్గుతో చెప్పలేదు. అదో రకమైన సౌండ్ ఇచ్చాడు.

మేరీః ఎలా ఉంది మస్తానూ? బానే ఉంటాదిలే నేను చేస్తే... కొంచెం నీళ్ళు తక్కువయ్యాయి...అంతే..!
మస్తాన్: "ఆనందం తో ఊళ వేసే నక్క అరుపుకీ, బాధ తో మూలిగే కుక్క ఏడుపుకీ తేడా తెలియట్లేదామ్మా....? ఎవడొస్తాడో గానీ... వాడి బతుకు బుగ్గిపాలే..."
మేరీః  ఏదో నీ అభిమానం మస్తానూ... ఇంకొంచెం వెయ్యనా?
-------------------------------------------------------------------------------------------------------------------------------------

సెమీ ఫైనల్ గా నేను చెప్పేదేమంటే...
తిండి ఒక అవసరం.వండే అవకాశం వరం. వంటకం బాగా రావటం మన అదృష్టం.చక్కగా వండిపెట్టేవాళ్ళు మనకి ఉండటం పూర్వజన్మ సుకృతం.
________________________________________________________________________________

సాటి బ్రహ్మీలకి, బాల వంటగాళ్ళకీ/గత్తెలకీ ఇవియే నా సూచనలుః

1. వంటల్లో చాలా రకాలున్నాయని అపోహలతో భ్రమపడీ భయపడుతుంటారు మన యువత.  ఉన్నవి మూడే. 1. ఇగురు 2. పులుసు 3. వేపుడు.
పోపులు నూనెలో మాడబెట్టి, అందులో ఉల్లిపాయలు వేయించి, కూరగాయ ముక్కలు పడేసి ఉప్పు, కారం జల్లేసి, కొంచెం నీరుపోసి కలిపేసి మూత పెడితే అది "ఇగురు". నీళ్ళెయ్యకుండా, మూత పెట్టకుండా మరికొంచేమ్ నూనేసి వేయిస్తే అది "వేపుడు". చింతపండు పులుసేస్తే  అది.."పులుసు". 

2. నాన్వెజ్జీ ల కోసం ప్రాణాలు అర్పించే బ్రాయ్లర్ కోళ్ళు లోకం లో కోకొల్లలుగా ఉండటం మన అదృష్టం. "బాగుంటాదో లేదో, ఉడుకుతాదో లేదో" అన్న టెన్షన్ అక్కర్లేదు. ఉప్పు-కారం వేసి ఉడకేస్తే అదే బాగుంటుంది.

3. ఉప్మా చేసేటప్పుడు ఉప్పెయ్యటం మరిచిపోవటం అనేది నమ్మిన మనిషి దగ్గర నమ్మకం పోగొట్టుకోవటం లాంటిది. అది ఒకసారి జరిగిపోతే మన చేతుల్లో ఏం ఉండదు. కాబట్టీ తస్మాత్ జాగ్రత్త.

4. దోసలు వెయ్యటం ప్రాక్టీస్ చేసినోడికి  స్టీరింగ్ తిప్పడం బాగా వస్తుంది. పవర్ స్టీరింగ్ కాకపోయినా ఒంటి చేత్తో డ్రైవింగ్ చేసీగల్రు.

5. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతాదంటారు. కానీ నీళ్ళెక్కువైనప్పుడు అరిటికాయ కూరా,చింతపండు ఎక్కువయినప్పుడు చారు, ఉల్లిపాయలెక్కువైనప్పుడు ఎగ్ బుర్జీ ల పరిమాణం పెరుగును. (FYI... గత్యంతరం లేని అత్యవసర పరిస్థితుల్లో వాడుకోండీ).

6. మొదట్లో ఉప్పు, కారం, పులుపు మొదలైనవి ఎక్కువ తక్కువలవుతాయి. అది సహజం. అందుకే ముందు జాగ్రత్త గా ఎంతోకొంత వెయ్యాలి. సరిపోలేదంటే మరికొంత వేసుకోవచ్చు. మన లక్ కిక్కిచ్చి ఎక్కువైపోతే మరికొన్ని నీళ్ళు పోసి మరిగించడమే.

7. వండేవాడికే అందరికంటే ముందు వంటకం టేస్ట్ తెలుస్తుంది. మన కర్మ కాలి ఎప్పుడైనా పదార్ధం తేడా కొట్టేసినట్టు తెలిస్తే, మినిమం గంట సేపు కూర పొయ్యి మీదుంచి కాలయాపన చేసెయ్యాలి. ఈ లోపు తినేవాళ్లకి  బాగా ఆకలి వేస్తుంది. మంచినీటి రుచి దాహమేసినప్పుడూ, మాడిన కూర రుచి ఆకలేసినప్పుడూ తెలుస్తుంది కాబట్టీ మనం సేఫ్ జోన్ లోకి పోతాం.

8. తినేవాడికి వండేవాడెప్పుడూ లోకువే. వాళ్ళిచ్చే నెగటివ్ కమెంట్స్ కట్ చేసేటప్పుడు ఉల్లిపాయల్లా కన్నీళ్ళు పెట్టిస్తూ మనల్ని మానసికం గా కృగదీస్తాయి. మన ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొడతాయి. మన పాక ప్రయోగం బెడిసికొట్టినప్పుడు అలాంటివి జరగకుండా రివర్స్ ఎమోషనల్ డ్రామాతో సన్నివేశాన్ని రక్తి కట్టించాలి. పాజిటివ్ కమెంట్స్ మాత్రమే ఏక్సెప్ట్ చేస్తామన్న విషయాన్ని మనం క్లియర్ గా తెలియజేయాలి.

9. మసాలాలు నూరెయ్యాలీ, అల్లం-వెల్లుల్లి దంచెయ్యాలీ, ఎండు మిరపకాయలు చిదిమెయ్యాలీ, చింతపండు పులుసు పిసికెయ్యాలీ... లాంటి రూల్స్ పక్కన పెట్టండి. పాలు కొని మరిగించాలి..  తోడుచుక్క కోసం పక్కింటికెళ్ళాలీ లాంటి పాతకాలపు పనులకి దూరంగా ఉండండి. మనకి రెడీ మేడ్ మసాలా పేస్టులున్నాయ్, పెరుగు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయ్. అంత గొప్పటేస్ట్ రాకపోయినా టైం వేస్టవ్వకుండా ఉంటుంది.

10. వంట చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నీ కుదిరితే తిండానికి ఇష్టం గా ఉంటుంది. కానీ అంట్లు తోమాలంటే  కష్టం గా ఉంటుంది. అవి అలాగే వదిలేస్తే  మాత్రం వాసన భరించలేనిదిగానూ, పరిస్థితి పాథటిక్ గానూ ఉంటుంది. కాబట్టీ చెయ్యి కడిగినప్పుడే అంట్లు కూడా కడిగెయ్యండి. (ఇది కొంచెం కష్టమే గానీ తప్పదు)

11. నేటీ హీరోయిన్లే రేపటి ఐటెం బాంబులు. నేడు మిగిలిపోయిన అన్నమే రేపటి కమ్మని పులిహోర. అన్నం ఇళయరాజా స్వరూపం. వేస్ట్ చెయ్యకండి.

12. మనమెన్ని వంటలు చేసినా, బయట ఎన్ని రుచులు చూసినా, అమ్మ చేసే వంటే గొప్పది. ఎందుకంటే అమ్మ మన కడుపు నిండాలన్న ప్రేమ తో వండి పెడుతుంది. హోటల్ వాడు వాడి జేబు నిండాలన్న ఆశతో వండిపెడతాడు. ఇక్కడ బిజినెస్ మాత్రమే ఉంటుంది, ఆ ప్రేమ మిస్సవుతుంది.

నోరూరించక పోయినా గానీ కడుపు మాడకుండా చేసే వంటకి నా ఈ 12 సూత్రాలూ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీరు ఫాలో అవ్వగలరని ఆశిస్తున్నాను. మీలో నిజంగా వంటొచ్చినోళ్ళు ఉంటే ఈ పాపిని క్షమించాలని వేడుకుంటున్నాను. మా మేరీ ఈ పోస్ట్ చదివి నన్ను కొట్టడానికి రాకూడదని కోరుకుంటున్నాను.
-------------------------------------------------xxx------------------------------------------------

మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 
మన  పరిచయాలూ, కబుర్లూ, స్నేహాలూ ఇలాగే కొనసాగాలనీ, మీ అందరికీ కొత్త సంవత్సరం గొప్ప గొప్ప అనుభూతులని ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తూ.....


జై హింద్..!!!

Monday, December 3, 2012

ఇది కధ కాదు 9 : తుది అశ్రు బిందువులు

ప్పించు కోడానికి చిన్న ప్రయత్నం కూడా చెయ్య లేదు రామరాజు. అతని మీద ఎన్ని నమ్మకాలు? ఎన్ని కధలు?? ఎన్ని అభియోగాలు? "మహిమలున్నాయంట అతనికి..! అతనికి గురిపెట్టిన తుపాకీ పేలదట. ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమవుతాడట". ఈ నమ్మకాలకి అతన్ని పట్టుకున్న అళ్వారు నాయుడు, జామేదార్ కంచుయేనన్ లు అతీతులు కారు. అలాంటి అల్లూరి శ్రీ రామరాజుని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాణాలతో పట్టేశారు. ఆలస్యం చెయ్యలేదు ఇక. ఒక నులకమంచం తెప్పించి  దాని మీద రాజుని పడుకోబెట్టి, అంగుళం కూడా శరీరాన్ని కదిపే వీలు లేకుండా తాళ్ల తో కట్టేశారు. రాజు ని సజీవంగా పట్టుకున్నట్లు మద్రాస్ కి టెలిగ్రాం ఇచ్చి,  ముందు కొయ్యూరు సైనిక శిబిరానికీ, అక్కడ నుండి కృష్ణదేవీ పేట కి తీసుకొస్తామని అక్కడి పోలీసులకి సమాచారం అందించారు. స్థానిక గిరిజనులని పిలిచి, రాజుని కట్టిన మంచాన్ని భుజాలకెత్తించారు. మంప గ్రామం నుండి కొయ్యూరు వెళ్ళాలి అంటే ఆరు మైళ్ళు అడవి లో వాగులు దాటి, వెదురు పొదలు దూరి ప్రయాణించాలి. ప్రయాణం మొదలైంది. మధ్యాహ్నం వేళకి కొయ్యూరు సరిహద్దులలోకి ప్రవేశించగా అప్పుడు జరిగిందో సంఘటన. తన బృందంతో పెట్రోలింగ్ చేస్తున్న అస్సాం రైఫిల్స్ అధిపతి మేజర్ గుడాల్ ఎదురయ్యాడు వీళ్లకి. విషయం తెలుసుకొని, రాజు ని తనకి అప్పగించవలసిందిగా ఆదేశించాడు.కంచుయేనన్ దానికి ఒప్పుకోకుండా మద్రాస్ ప్రెసిడెన్సీ ఆదేశాల మేరకు రాజు ని స్వయం గా కృష్ణదేవిపేట తీసుకెళ్ళి కలెక్టర్ కి అప్పగిస్తానన్నాడు. మరి రాజుని పట్టిస్తే వచ్చే డబ్బు, అంతకు మించి వచ్చే వెలకట్టలేని కీర్తినీ ఎవరు మాత్రం వదులుకుంటారు?? దీనితో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. అది సంవాదం కాదు..  పక్కనే మంచానికి కట్టి వేయబడి ఉన్న రాజు ప్రాణాలు ఉండాలా? వద్దా?? అన్న విషయం మీద పరోక్షం గా జరుగుతున్న వాదన.గుడాల్ తన హోదానీ, అధికారాన్నీ, మొండితనాన్నీ ఉపయోగించి బెదిరించడం తో రామరాజుని అప్పగించక తప్ప లేదు కంచుయేనన్ కి.

మేజర్ గుడాల్ రామరాజుని తన శిబిరం వద్దకు తీసుకెళ్ళాడు. ఉద్యమానికీ, దాడులకీ సంబంధించి ఇద్దరి మధ్యా చిన్నపాటి వాగ్యుద్ధం జరిగింది. ఏ తెల్లవాడూ సమాధానం చెప్పలేని ప్రశ్నలున్నాయ్ రాజు వద్ద. తన పోరాటానికి బలమైన కారణం ఉంది. నిస్వార్ధమైన ఆశయముంది. న్యాయముంది. నిజాయితీ ఉంది. కానీ ఎదురుగా ఉన్న గుడాల్ చేతిలో గన్ మాత్రమే ఉంది. రాజు ని ఒక చింతచెట్టుకి కట్టివేయించాడు. అతని తల కి ముసుగు తొడిగించాడు. గన్ గురి చూసి కాల్చలేదు గుడాల్. గుండెల మీద పెట్టి కాల్చాడు. మూడుసార్లు తుపాకీ నిప్పులు కక్కింది. అల్లూరి శ్రీరామరాజు విడిచిన ఆఖరి శ్వాస అతనిచ్చిన గుండె ధైర్యం తో శత్రువులనీ, అతన్ని మోయబోతున్న గిరిజనులనీ, చెట్లనీ, పుట్లనీ, పువ్వులనీ ఎటువంటి వివక్షా చూపించకుండా స్పృశిస్తూ వెళ్ళిపోయింది. ఈ మన్యం వీరుడి చావు కి తను వెన్నుదన్ను గా నిలిచానని బాధ పడిందో?? లేకా  రాజుగారు  తన ఒడిలో  ప్రాణాలు విడుస్తున్నందుకు గర్వ పడిందో... ఆ చెట్టు.

రాజు మరణించిన విషయాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ కి వైర్లెస్ లో కొయ్యూరు నుండి సమాచారం పంపించాడు గుడాల్. ప్రాణాలతో పట్టుకున్న వాడిని ఎందుకు చంపవలసి వచ్చిందో సంజాయిషీ చెప్పమనడం తో "కొయ్యూరు చేరాక లఘుశంక కొరకు రాజు కట్లు విప్పమని కోరాడనీ,విప్పిన తర్వాత  తప్పించుకొని పారిపోడానికి ప్రయత్నించడం తో కాల్పులు జరుపవలసి వచ్చిందని" కధ అల్లి చెప్పాడు. తర్వాత రామరాజు భౌతిక కాయాన్ని అదే మంచానికి కట్టి  "బ్రిటీష్ సింహాసనాన్ని ఎదిరిస్తే... ఎవరికయినా ఇదే గతి పడుతుందనీ " గ్రామగ్రామానా ఊరేగింపు తీశారు.

చీకటి పడే సమయానికి రాజు శవాన్ని కృష్ణదేవీపేట కి చేర్చారు. రాజు సజీవం గా పట్టుబడ్డాడని మాత్రమే తెలిసిన  ప్రజలు , రాజు శవమై వచ్చాడని తెలిసి కలత చెందారు. "రూధర్ ఫర్డ్" మాత్రం గుడాల్ చేసిన పనికి అతని పై మండి పడ్డాడు. "తను చేసింది తప్పే అయితే... తనని సంజాయిషీ అడగవలసింది బెంగాల్ గవర్నర్ మాత్రమే అనీ, తనని ప్రశ్నించే అధికారం ఇక్కడ ఏ అధికారికీ లేదనీ" మొండికేశాడు మేజర్ గుడాల్. వేరే దారి లేక అతను అల్లిన కధనే యదార్ధ ఘటన గా ప్రకటించాడు రూధర్ ఫర్డ్.

ఎక్కడయితే కృష్ణదేవీపేట ప్రజలకి శ్రీ రామరాజు పరిచయమయ్యాడో, ఎక్కడ యోగిగా ఆధ్యాత్మిక బోధనలు చేశాడో, ఎక్కడ మన్యం వాసులకి ఆయుర్వేద వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టాడో, ఏ స్థలం లో పంచాయితీ పెద్ద గా తీర్పులిచ్చాడో, ఆఖరికి ఎక్కడ ఒక విప్లవకారుడై దర్శనమిచ్చాడో... సరిగ్గా అక్కడే , ఆ రామాలయం దగ్గరే ఆయన మృతదేహాన్ని ప్రదర్శనకి పెట్టారా రోజు.

నమ్మలేదు మన్యం..
తూటాలూ, తుపాకులూ ఆయన్నేం చేయగలవు??
అసలు అవతార పురుషులకి అంతం ఏంటి?
శ్రీ రామరాజు ఆ భద్రాద్రి రాముడి అవతారం. ఆయనకి చావేంటి??

కానీ ఊహలూ, నమ్మకాలూ గొప్పగా ఉంటాయి. వాస్తవాలు తట్టుకోలేనంతగా, బాధాకరంగా, ఒక్కోసారి అసహ్యం గా ఉంటాయి. 

శవ పంచాయితీ మొదలైంది దీపాల వెలుగు లో.. వీధి వీధినా పోలీసులే... ఆనందోత్సాహలతో కేరింతలు కొడుతున్నారు..ఊరంతా కదం తొక్కుతున్న మిలిటరీ బూట్లు...లాఠీలు...!
"మీ రాజొచ్చాడు... పాలు ఇవ్వండి... తాగుతాడు"
"మీ రాజు గారు పంచాయితీ పెడుతున్నారు రండీ.."   వెటకారాలు.. ఎకసెక్కాలు...
"మీ దేవుణ్ణి చంపేశాం....వచ్చి చూస్కోండి" .. కోపం... పగ... ఇన్ని నెలలు గా తమకి కంటి మీద కునుకు లేకుండా చేసిన రామరాజంటే ద్వేషం. ఇక ఈ అడవి లో భయపడుతూ తిరగాల్సిన పనిలేదన్న ఆనందం.
గుండె భారం దించుకొనేలా, గుండెలవిసేలా ఏడ్చే స్వాతంత్ర్యం కూడా లేదు గ్రామ ప్రజలకి.

రాజు చేత "అన్నగారూ" అని పిలిపించుకున్న చిటికెల భాస్కరనాయుడు గారు... రాజు విప్లవకారుడయ్యాక అతన్ని కలవడానికి ఇష్టపడని  భాస్కరనాయుడు గారు వచ్చారు రాజుని చూడ్డానికి. చనిపోయింది శ్రీరామరాజే అని గుర్తించే బాధ్యత అతనిదే మరి. రాజుతో పరిచయమున్న 50 మంది మున్సబులొచ్చారు రామరాజు ని గుర్తించడం కోసం. కట్లు విప్పి రాజు శవాన్ని చెట్టుకి జారేశారు. ఫోటోలు తీసే కార్యక్రమం ప్రారంభమైంది. హృదయ విదారకంగా ఉందా దృశ్యం.. చాతీ మీద పాయింట్ బ్లాంక్ లో కాల్చిన దానికి ఫలితంగా మాంసపు పీలికలు వేలాడుతూ మూడు పెద్ద రంధ్రాలు. రక్తం లో ముంచి తీసినట్టున్నాయ్ బట్టలు. తెల్లవాళ్ల రక్తపుటేరులు పారించిన రామరాజుని మాంసపు ముద్ద చేసి, అతని నెత్తురుని కళ్ళజూసి ప్రతీకారం తీర్చుకుంది వలసదారుడి ప్రభుత్వం....!


తెల్లవారిపోతుంది. శవం నుండి వాసన మొదలైంది. ఊరి శివార్ల లో దొరికిన కట్టెలతో చితి పేర్చారు. చితికి నిప్పంటించే ముందు గా రాజు ధరించిన ఖాకీ నిక్కరు లో లభించిన రక్తంతో తడిచిపోయిన మొల గడియారం, పుస్తకం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వందల మంది చూస్తుండగా, సూర్యోదయం అవుతుండగా, రెండో సూర్యుడి లా చితి మండటం మొదలైంది. ఎన్నో భయాల మధ్య పోలీసులే చితా భస్మాన్ని తాండవ నది లో కలిపేశారు.

******************************************************************************

రాజు చనిపోయాక బ్రిటిష్ సేన కి కొండంత ధైర్యం వచ్చింది. ప్రత్యేక దళలాని వెనక్కి పంపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. రాజుదళం లో ప్రధమ సేనాని అయిన "గంటం దొర" నాయకుడయ్యాడు. అతన్ని పట్టుకొనే పని మీద 15 కి పైగా పోలీస్ దళాలు గాలిస్తున్నాయి. ఆ సమయం లోనే "నడింపాలెం" గ్రామానికొచ్చిన గంటందొర "రామరాజు బ్రతికే ఉన్నడనీ, ముగ్గురు అనుచరులతో మాంచ్ ఖండ్ వెళ్ళాడనీ...జూన్ 2 నాటికి తానేంటో చూపిస్తానని" ప్రకటించాడు. అయితే పోలీసులకి పట్టుబడిన అగ్గిరాజు నుండి సమాచారం రాబట్టిన పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమం మొదలు పెట్టిన రామరాజు లేకపోవడం, పోలీసులు పెట్టే బాధలు, సహకరిస్తే వచ్చే బహుమతులు ప్రజల్లో చాలా మార్పు తీసుకొచ్చాయి. ఏ గ్రామం ఉద్యమకారులని ఆ గ్రామ ప్రజలే కొట్టి చంపేయ్యడమో, ప్రాణాలతో పట్టుకొని పోలీసులకి అప్పగించడమో చేయడం సాధారణమయ్యింది.

మే 26 న జరిగిన ఒక సంఘటన మాత్రం ఉద్యమాన్ని పునాదులతో సహా పెకలించడానికి వీలుచేసింది. రాజుదళం లో ప్రధాన సభ్యుడయిన ఎండుపడాలు ని చంపేసినప్పుడు అతని దగ్గర రాజు వాడే "పూజ పెట్టె" (ఇది ఎవరో బ్రిటిష్ అధికారి వాడే లెదర్ బ్యాగ్. దాన్ని రాజు స్వాధీనం చేసుకొని వాడేవాడు.) దొరికింది పోలీసులకి. అందులో పుస్తకాలు, మ్యాపులూ దొరికాయి. ఏ యే గ్రామం నుండి ఎవరెవరు ఉద్యమం లో చేరినది, ఎప్పుడు చేరినదీ? ఎప్పుడు సెలవు తీసుకొని వెళ్ళిపోయినదీ మొత్తం వివరాలు రాసి పెట్టుకున్నాడు రామరాజు. అలాగే ఏ యే పోరాటాలలో ఎవరెవరు చనిపోయారో, ఎవరు కొండదళాన్ని పట్టివ్వడానికి ప్రయత్నించారో, ఆ గ్రామ ప్రజల మీద రామరాజు విధించిన సుంకాల వివరాలు కూడా అందులోనే ఉన్నాయి. ఈ సమాచారమంతా పోలీసుల చేతికి రావడం తో మొత్తం ఉద్యమకారులంతా పిట్టల్లా రాలిపోయారు.
 1924, జూన్ 7
గంటం దొర  చిన్న భార్య పోలీసులకి చిక్కింది. సరిగ్గా మూడు రోజుల తర్వాత అతని పెద్ద భార్య, పిల్లలు అతనికి భోజనం తీసుకువస్తుండగా "వలసం పేట" గ్రామం లో పోలీసులకి దొరికిపోయారు. గంటం దొర ఉన్న ప్రాంతం గురించి చెప్పక తప్పలేదు వాళ్ళకి.గంటందొర దళం, పోలీసు బెటాలియన్స్ కి మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఎడమ తొడ విరిగి, తూటాలు శరీరం లోకి చొచ్చుకుపోయి కొనప్రాణం తో పోలీసులకి దొరికిపోయిన గంటందొరని బయొనెట్ తో పొడవటం తో కన్నుమూసాడు.కృష్ణదేవీపేట కి అతని శరీరాన్ని తీసుకొచ్చి, రాజు కి దహన సంస్కారం చేసిన చోటనే అంత్యక్రియలు జరిపారు. 

గోకిరి ఎర్రేసు ని పోలీసులు పట్టుకున్నారు. మల్లుదొరకి ఉరిశిక్ష విధించి, ఆ పై దానిని జీవిత ఖైదుగా మార్చారు. చాలామంది తెల్ల సైన్యం జరిపిన కాల్పుల్లో చనిపోగా, ఉద్యమం ముగిసిన తర్వాత సుమారు 300 మంది  జైలుకి పంపించ బడ్డారు. అందులో  నెల రోజుల శిక్ష నుండీ జీవిత ఖైదు వరకూ విధింపబడ్డవారు ఉన్నారు.
జూన్ నెలాఖరుకి, అంటే అల్లూరి శ్రీరామరాజుచనిపోయిన నెల రోజులకి,  ఫితూరీ ఆనవాలు లేకుండా పోయింది. పోరాటం ముగిసింది...!

****************************************************************************
12 సంవత్సరాల తర్వాత...
Indian national congress ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉన్న C. రాజ గోపాలాచారి గారి చొరవ తో  చాలామంది మన్యం వీరులు విడుదల  అయ్యారు. ఇలా విడుదలయ్యి స్వేచ్చా ప్రపంచాన్ని చూసిన వారిలో మల్లుదొర, గోకిరి ఎర్రేసు కూడా ఉన్నారు.

ఉద్యమం లో కీలక పాత్ర వహించినా గానీ  వ్యసనాల కారణం గా రామరాజు చేత వెలివేయబడి, పోలీసులకి పట్టుబడిన మల్లుదొర, జైల్ నుండి విడుదలయ్యాక, 1952 లో పార్లమెంట్ కు నామినేట్ అయ్యి హస్తిన లో అడుగుపెట్టాడు.

రామరాజు ని చివరి వరకూ నమ్మి, అందరికీ దూరమైన గోకిరి ఎర్రేసు. .. ఒక సొరకాయ తంబురా చేత బూని కృష్ణదేవి పేట వీధులలో తత్వాలు పాడుతూ, భిక్షక వృత్తి చేపట్టాడు తన చివరి రోజుల్లో.

 ఏమయిపోయాడో లోకానికి తెలియని అగ్గిరాజు 1936 లో అండమాన్ సెల్యులర్ కారాగారం లో  అనామకం గా కన్నుమూసాడు.
ఇక రామరాజు వెనకే వెన్నంటి నడిచీ, రాజు ఆశయాలకి అనుగుణం గా మసలుకొన్న గంటందొర. ఆ రాముడి తో ఆ లక్ష్మణుడు అడవికి నడిస్తే, ఈ రామరాజు తో చావు లోనూ తోడు వెళ్ళిన గాం గంటం దొర  ఇదిగో..... ఇలా రాజుగారి పక్కనే , విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు తో పాటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
(కృష్ణదేవి పేట లో అల్లూరి మరియు గంటం దొరల సమాధులు. కొద్ది కాలం కిందట వీటికి మెరుగులు దిద్దారు)
*******************************************************************************

"ఉద్యమ సాఫల్య వైఫల్యాల మీద చర్చ అనివార్యం. ఉద్యమ నేత దృష్టి, పంధా, తాత్వికతల గురించి అంచనాలూ అవసరమే. నిజానికి అదొక పాఠం. అంతకంటే కూడా, ఒక సదాశయం కోసం జరిగిన రక్త తర్పణలనీ, త్యాగాలనీ, ఆ ఆశయం కోసమ్ ఒక తరం పడిన వ్యధనీ,బాధనీ, క్షోభనీ, అన్నిటికీ మించి ఆ తరం  కార్చిన కన్నీళ్లని అలా గాలికి వదిలివేయడం ఒక తప్పిదం. ఒక ద్రోహం. కాబట్టే ముందు తరాలు, ఆ ఉద్యమం నీడ, ఆ నేత నీడ కాలం మీద ఎలా పరుచుకున్నాయో చూడాలి. అదొక స్పూర్తి."
--- శ్రీ గోపరాజు నారాయణరావు

*********************************************************************************
అల్లూరి సీతారామరాజు గారి మీద ఎవరెవరు పుస్తకాలు రాశారో, అవి ఎక్కడ దొరుకుతాయో పెద్దగా సమాచారం లేదు.నిజానికి శ్రీరామరాజు మీద రాయబడిన పుస్తకాలు ఉన్నాయి కానీ వాటి వివరాలు తెలియవు. పైగా రామరాజు స్వాతంత్ర్యం వచ్చేవరకూ బతికే ఉన్నాడనీ, అతనికి 8 మంది భార్యలనీ,బెండపూడి లో ఉన్న సాధువే రామరాజనీ విచిత్రమైన కధలూ, వాటిని సొమ్ము చేసుకుని హడావిడి చేసే టీవీ కార్యక్రమాలూ, రామరాజుని ఒక బందిపోటు దొంగ, భూకబ్జాదారుడి గా చిత్రీకరించిన కధనాలు పుట్టుకొచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఈ తెలుగు గడ్డలో పుట్టి ,పాతికేళ్ళ వయస్సు లో ప్రపంచం లోని అతిపెద్ద సైనిక శక్తి పై అమాయకప్రజల చేత తిరుగుబాటు చేయించీ, దాదాపు రెండేళ్ల పాటు పోరాటం చేసి, అతి తక్కువ వయస్సులోనే వీరమరణం పొందిన ఒక మహనీయుడి గురించి భావి తరాలకి తెలియజేసే ప్రయత్నాలు జరగకపోవడం బాధాకరం.  రాజకీయనాయకుల మీదా, క్రీడాకారుల మీదా, కవుల మీదా స్కూల్ పాఠ్యపుస్తకాల్లో పాఠాలున్నాయి గానీ ఈ తెలుగోడి మీద ఏ తెలుగు పాఠ్యపుస్తకం లోనూ, ఏ సోషల్ స్టడీస్ పుస్తకం లోనూ లేకపోవడాన్ని ఏమనాలో?.  అతని గురించి తెలుసుకోడానికి అందరికీ అందుబాటులో ఉన్న, అందరికీ అర్ధమయ్యే విధంగా ఉన్న ఏకైక మార్గం... అల్లూరి సీతారామరాజు సినిమా. రామరాజు గురించి ఎంతో రిసెర్చ్ చేసి,  తెలుగు చలన చిత్రాలలో గర్వంగా చెప్పుకోదగ్గ గొప్ప సినిమా తీసి,(అందులో కొన్ని కల్పితాలున్నా సరే) తన అద్బుతమైన డైలాగ్ డెలివరీ తో మంత్రముగ్ధుల్ని చేసి, అల్లూరి గురించి తెలుసుకోవాలనే తపనని నాలో కలుగజేసిన  సూపర్ స్టార్ కృష్ణ గారికీ, ఆ సంభాషణలు అందించిన మహారధి గారికీ, రామరాజు మీద రాయబడిన పుస్తకాలన్నిటినిటి మీదా పరిశోధన చేసి,  ఓ గొప్ప పుస్తకాన్ని రాసిన శ్రీ గోపరాజు నారాయణ రావు గారికీ ఈ సిరీస్ అంకితం.

సరదా పోస్టులు రాసుకునే నా చేత ఇలాంటి సిరీస్ రాసేలా ప్రోత్సహించిన ఆలమూరు  సౌమ్య గారికీ, తమ విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతీ పోస్టుకీ వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించిన నా మిత్రులకీ ప్రత్యేక కృతజ్ఞతలు.

జై..హింద్..!

Thursday, November 29, 2012

ఇది కధకాదు 8 : బీటలు వారిన ఉద్యమం

1923 డిసెంబర్.
కాకినాడ లో  జాతీయ  కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయ్. మౌలానా మహమ్మదాలీ ఆ సభలకి అధ్యక్షుడు కాగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా వెంకటప్పయ్య గారు ఆహ్వాన సంఘం అధ్యక్షులు. చిత్తరంజన్ దాస్, వల్లభాయ్ పటేల్ మొదలైన ప్రముఖులు సమావేశాలకి వచ్చారు. నాయకుల, ప్రతినిధుల సందేశాలు చదువుతుండగా ఒక సిక్కు వాలంటీరు ఒక చీటీని వేదిక మీదకి పంపి దానిని తన సందేశంగా చదివి వినిపించమని కోరాడు. అధ్యక్షులు మహమ్మదాలీ తిరస్కరించాడు. ఆ సిక్కు వాలంటీరు వత్తిడి చేసేసరికి వేదిక మీద ఉన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి ఇచ్చేసారు ఆ చీటీని. ఆ చీటీలో విషయం ఏంటంటే...
"తాను సాయుధ సమరం చేస్తున్నాననీ, వీలైతే కార్యకర్తలను పంపడం, కాస్త ధన సహాయం చెయ్యడం తప్ప, తన దారికి అడ్డురావద్దని".
అసలు విషయం ఏంటంటే.. ఆ గెడ్డం సిక్కు వాలంటీరు ఎవరోకాదు మారు వేషం లో వచ్చిన రామరాజు . తను కనిపిస్తే చాలు.. ఉన్న పళంగా ఉరికొయ్యకి వేలాడదియ్యడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి తెలిసీ కాకినాడ రావడం ఒక సాహసం అయితే తన పేరున సందేశం వినిపించాలని కోరడం మరొకటి.

*******************************************************************************
1924 జనవరి 27
 700 మందికి పైగా పోలీసులు, 30 మంది ఆఫీసర్లు సంవత్సరం ఆరు నెలల పాటు తిరుగుతానే ఉన్నారు. రోజు కూలీ ఆరు అణాలు ఉన్న టైం లో 13 లక్షల రూపాయల ఖర్చు.

పూర్తి స్థాయి సైనిక చర్య కి ముందుగా ఆఖరి ప్రయత్నంగా  ప్రభుత్వం భావించిన అస్సాం రైఫిల్స్ దళం ( 400 మంది )  నర్సీపట్నం రైల్వేస్టేషన్ లో దిగి కోట ఉరట్ల మీదుగా మన్యం చేరింది. రామరాజు వెంట వంద మంది ఉన్న ఆ సమయానికి, మన్యం లో సైనిక బలగాల సంఖ్య 1000 కి చేరింది. మేజర్ గుడాల్ తన దళాన్ని బృందాలు గా విడదీసి గాలింపు ప్రారంభించాడు. పోలీస్ పదఘట్టనలతో అడవి గ్రామాలన్నీ కంపించిపోతున్నాయ్.
1924 నాటికి 1200 మంది పోలీసులు,  అస్సాం రైఫిల్స్ దళం,  16 మంది ఉన్నతాధికారులు, 450 మంది ఇతర స్థాయిఅధికారులు తిరుగుతున్నారు. మోత కోసం 106 గాడిదలు, 12 ట్రక్కులు ఉన్నాయి
మరో వైపు రామరాజు సేన కూడా 3 బృందాలుగా తన కార్యకలాపాలని సాగిస్తుంది. ఉద్యమ కారుల కుటుంబ సభ్యులు ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో, ఎక్కడ భోజన సామాగ్రి, బట్టలు ఇవ్వాలో అక్కడ ప్లాన్ చేసిన ప్రకారం ఎవ్వరికీ అనుమానం రాకుండా జరిగిపోతున్నాయ్. అయితే రాజు ప్రధాన అనుచరుల్లో ఒకడయిన వీరయ్య దొర భార్య ఇలాంటి ప్రయత్నం లోనే అస్సాం రైఫిల్స్ కి దొరికిపోయింది. అతని కుటుంబం మొత్తం రాజు వెనకే తిరిగేది. ఆమె నుండి పోలీసులు రాబట్టిన సమాచారం తో "సుద్ధగంట" కొండలలో దాచిన కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి.
***************************************************************************
1924 ఏప్రియల్
మించాలపాడు సత్యాగ్రహం లో కన్నెగంటి హనుమంతు ని తుదముట్టించి, ఉద్యమాన్ని దిగ్విజయం గా అణచివేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ "టి.జి. రూధర్ ఫర్డ్" ఏజన్సీ లో స్పెషల్ కమిషనర్ గా నియమింప బడ్డాడు. చినుకు పడే లోపు ఉద్యమాన్ని రూపు మాపేయాలని రూధర్ ఫర్డ్, గుడాల్ లు నిర్ణయించారు. రామరాజు ని పట్టి ఇస్తే ఇచ్చే బహుమతి ని Rs. 1500 నుండి Rs. 10,000 కి పెంచడమే కాక  మరో ఏడుగురిని క్షమించరాని నేరస్థులు గా ప్రకటించాడు. ఉద్యమ క్షేత్రమైన మన్యాన్ని బెదిరించడానికి, తన లక్ష్యం సాధించడానికి తనకి తెలిసిన అన్ని విద్యలూ, వికృతులూ ప్రదర్శించడం మొదలు పెట్టాడు రూధర్ ఫర్డ్. పల్లె పల్లెనీ వేధించే పని మొదలైంది. రాజు ని పట్టించాల్సిన బాధ్యత ప్రజలదే అనీ, అలా కాని పక్షం లో మన్యం మొత్తాన్నీ తగలబెట్టేస్తాననీ, ప్రతీ ఊరికీ కిరోసిన్ పీపాలు దింపుతాననీ ప్రకటించాడు. అనడమే కాదు చినమల్లం పేట, కంఠారం మొదలైన గ్రామాలు మొదలుకొని ఊళ్లకి ఊళ్ళు తగలబెట్టి తనేంటో ప్రజలకి చెప్పాడు. రాజు కి ఎంతో ఇష్టమయిన "ధారమఠం" మీద దాడితో పాటూ విధ్వంసం జరిగింది. ఉద్యమానికి మద్దతు ఇస్తున్న మున్సబులు, ప్రజలు వేరే విచారణ లేకుండా జైలుకి పంపబడ్డారు.  ఉద్యమం మొదలు కావడానికి ఎటువంటి పరిస్థితులు దారి తీశాయో, అంతకంటే భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మగవారికి చిత్రహింసలూ జరుగుతున్నాయ్.   ఇవన్నీ రామరాజు కోసం వేసే వలలు అనుకోవచ్చు, రాజు ని దెబ్బకొట్టడానికి పోలీస్ పధకాలు కావచ్చు. కావాలి...రామరాజు ప్రాణాలతోకావాలి. తమ చేతికి రాజు చిక్కేవరకూ ఇవే పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరికలు పంపాడు రూధర్ ఫర్డ్. కారణం ఏదయినా మన్యం ప్రజల పరిస్థితి పెణం మీద నుండి పొయ్యి లో పడ్డట్టు అయ్యింది. ఒక వైపు పంటలు లేవు. మరో వైపు పోలీస్ ల దారుణాలు. వీటి తో ఉద్యమానికి సహాయం చేసే వారు కాదు కదా కనీసం భోజనం పెట్టేవారు కూడా కరువయ్యారు. అంతే కాక కొంతమంది విప్లవకారులని పట్టించడం మొదలు పెట్టారు. దీనితో ఉద్యమకారులలో అసంతృప్తి భగ్గుమంది. పట్టించిన  వారిని తీవ్రంగా దండించడం మొదలు పెట్టారు.
మే నెలలో రాజు ప్రధాన అనుచరుడు వీరయ్య దొర  పోలీసులకి పట్టుబడ్డాడు.

ఇలాంటి పరిస్థితులలో పైడిపనుకుల గ్రామం లో సమావేశమైంది కొండదళం. తెల్లదొరలు గుడారాలు దాటి రారు. నల్ల పోలీసులని చంపకూడదని నియమం. కానీ అలాంటి నియమం వాళ్లకి లేదు. శత్రువు రక్త పిపాసి. "మరి ఉద్యమం ఎలా నడుస్తుంది??" అన్న ప్రశ్న సూటిగా తాకింది రామరాజు ని. "భారతీయులని చంపకూడదు" అన్న విచక్షణ కి స్వస్తి పలకాలని గట్టిగా అభిప్రాయ పడ్డారు కొందరు. చేతిలో తుపాకి ఉండీ ఊరుకోవడం వల్ల ప్రజల్లో నమ్మకం పోతుందని, బ్రిటిష్ సేన రెచ్చిపోతుందనీ వాదించారు. అయినా తన పంధా మార్చుకోనని తెగేసి చెప్పాడు రాజు. మారాల్సిందేనని పట్టుబట్టింది ఒక బృందం. "అయితే నన్నే పట్టివ్వండి" అన్నాడు రాజు. దళం లో చీలిక వచ్చింది. ఆ బృందం రాజు దగ్గర సెలవు తీసుకుంది.
******************************************************************************

1924 మే 5
శ్రీ రామరాజు, గంటందొర, అగ్గిరాజు కొండపల్లి వచ్చారని తెలిసి ఇంటెలిజన్స్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పట్నాయక్ తన బలగం తో వెళ్ళాడు. రాజు ఆచూకీ కోసం గ్రామాన్ని ధ్వంసం చెయ్యడం మొదలెట్టాడు. అప్పటికే రామరాజు వెళ్ళిపోయాడని తెలియడంతో వేట మొదలైంది. కొంత దూరం వెళ్ళేసరికి కనిపించడం తో ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి. అగ్గిదొర పోలీసులకి దొరికి పోగా ఎర్రేసు, గంటందొర, ఎండుపడాలు మొదలగువారు తప్పించుకున్నారు. అయితే ఆ మర్నాడు మధ్యాహ్నం మూడుగంటల సమయం లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. కొందరు చనిపోయారు. కొందరు దొరికి పోయారు. ఒకే ఒక్కడు ఒంటరి గా మిగిలిపోయాడు. ఆ ఒక్కడూ... రామరాజు. చీకటి పడింది. ఆ చీకట్లోనే కొత్తరేవళ్ల మీదుగా మంప  గ్రామానికి చేరుకున్నాడు. ఎదురుగా జొన్న చేను. చేను మధ్యలో మంచె. ఎక్కి పడుకున్నాడు.
రాజు మనసులో ఆలోచనలు కుదిపేస్తున్నాయి.
అవును.. మన్యం లోని అశాంతిని  పారద్రోలి, స్వేచ్చని ప్రజలకిద్దామనుకున్నాడు. అందుకే పోరు మొదలెట్టాడు. పోరాడాడు. సాధారణ జనానికి ధైర్యం నూరిపోసి తిరుగుబాటు చేయించాడు. కానీ చివరకి ఏమయ్యింది? పరిస్థితులు "కొరడా దెబ్బల మీద కారం" నుండి "కొడవళ్ల తో వాతలు" వరకూ వచ్చాయి.  మర్రివాడ లోని "ఎలచూరు ఎల్లమ్మ" అనే గిరిజన మహిళ. తను ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా  ఆత్మీయత తో పాలు పంపించేది. రామరాజు పై చూపించిన ఆ అభిమానమే రాజద్రోహమయ్యింది. రాజు ఆచూకీ చెప్పమని ఎర్రగా కాల్చిన కొడవలి ఆమె వీపు కి అంటినప్పుడు ఆమె చేసిన ఆర్తనాదానిది ఏ భాష??
ఒక ఉద్యమకారుడి పేరు, తన పేరు ఒక్కటే అయిన పాపానికి ఒక అమాయక యువకుడి ని పీకలవరకూ గొయ్యి తీసి పాతి, తాటాకు నిప్పంటించి తల మీద పెట్టి సజీవ దహనం చేసినప్పుడు ఆ అమాయకుడు చేసిన రోదన తనని పట్టి చిత్రవధ చెయ్యటం  లేదూ?? నేరం ఎవరిదీ? పరాయి వాడి పాలన కింద బతుకీడ్చాల్సి వచ్చిన పరిస్తితులదా? ఉద్యమం లేవనెత్తిన తనదా? విచక్షణ మరిచిన శత్రువుదా?
తన సంస్కరణ వాదం, సిద్ధాంతాలూ, నియమాలూ ఏం మార్పు తీసుకురాగలిగాయి??
తాగి తన అనుచరుడు పట్టుబడిపోయిన  సంఘటన తన ఆశయాన్ని అవహేళన చెయ్యటం లేదూ?
ఏ ప్రజలని రక్షిద్దామని పోరు మొదలెట్టాడో, అదే ప్రజలని  ఉద్యమాన్ని నిలబెట్టుకోడానికి తన మనుషులే హింసిస్తున్నప్పుడు, అది తను సహించాల్సి వచ్చినప్పుడూ, ఉద్యమకారుల పేరుతో కొందరు ప్రజలని దోచుకుంటున్నప్పుడూ, తను ఆపలేనప్పుడూ మన్యం ప్రజలని తన కారణం గా చిత్ర హింసల పాలుచేస్తుంటే తను ఇలా ప్రాణాలు దక్కించుకోడానికి తప్పించుకు తిరుగుతున్నప్పుడూ ఈ పోరాటం ఎందుకు? ఎవరికోసం??

ఉద్యమం  లో శత్రువుకీ విచక్షణ ఉంటుందని, వుండాలని ఆశించడం పొరపాటు. కానీ ఉద్యమకారుడు కూడా విజ్ఞతని విడిచిపెట్టడానికి సిద్ధపడితే అది గ్రహపాటు.
 ఇక మిగిలేవి లక్ష్యాలు కావు.... కక్ష్యలు.
 జరిగేది పునర్నిర్మాణం కాదు... విద్వంసం.
దీనికి అవతల్నుండి జవాబు... మళ్ళీ విధ్వంసం... రక్తపాతం...!
దీన్ని కొనసాగించడానికి ఇందరు అమాయకులని బాధించాలా??


1924 మే 7 ఉదయం 7.30  తరువాత....
రాజు నిద్ర లేచి, ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించిన రాజన్న పడాలు ఇంటికి దగ్గర లోని కుండం లో స్నానం ముగించాడు. చుట్టూ చింతల తోపులు. సరిగ్గా అప్పుడే... ఆ చింతల తోపుల నుండి కొంత సాయుధ సైన్యం రాజుని చుట్టి ముట్టింది.  ఆ ప్రాంతం లో నిఘా నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ సబ్ ఇన్స్పెక్టర్ "ఆళ్వార్ నాయుడు" రాజుని పట్టుకున్నాడు. అతి సంక్లిష్టమయిన సమస్యలకి చాలా సులభమైన సొల్యూషన్ దొరుకుతుందన్నట్టూ, సంవత్సరం పది నెలలపాటు బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన అల్లూరి శ్రీ రామరాజు పోలీసుల చేతికి చిక్కాడు.

ఈ సారి ఏ అద్బుతాలూ జరగలేదు..
మలుపులు లేని ముగింపు.... వచ్చే భాగం లో.....!!

Monday, November 26, 2012

ఇది కధ కాదు 7 : ఆగని సమరం..!

క దేశం తో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలందరినీ శత్రువులు గా భావించాలా??
మన శత్రువు యొక్క అనుచరులంతా వేరే ఏ కారణం లేకుండా మన శత్రువులేనా??
ఆ శత్రువు పరిపాలనా వ్యవస్థే అయితే అందులో భాగమైన వారందరిపై యుద్ధం చెయ్యాల్సిందేనా??
మన అయిష్టాన్నీ, ద్వేషాన్నీ చూపించాల్సిందేనా??

వీటికి సమాధానం అవును అయినా కాదు అయినా రామరాజు మాత్రం పోరాటం పేరుతో అనవసర హింస కి ఎప్పుడూ పాల్పడలేదు తను హింసా పద్ధతిలో నడుస్తున్నా సరే. 1923 ఆగస్ట్ 4 న జరిగిన ఒక చిన్న సంఘటన దీనికి మరో ఉదాహరణ.
 పెదవలస సమీపం లోని రంపులఘాటీ లో ఇద్దరు పోలీసులని రాజు దళం పట్టుకుంది. శత్రువు కి కూడా మర్యాద ఇవ్వడం రామరాజు గుణం.  ఆ ఇద్దరు పోలీసుల నుండీ కొన్ని రొట్టెలని సేకరించాడు. పెద్దవలస పోలీస్ శిబిరం నాయకుడైన పీటర్సన్ కి ఒక పోస్టల్ రశీదు వెనక ఉత్తరం రాసిచ్చాడు.

ప్రియమైన పీటర్ సన్!
                               నా సహచరుడు అగ్గిరాజు జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రొట్టెలు అతని కొరకు మీ వారి నుండి తీసుకున్నాను. అందుకు మీకు ఒక బుట్ట పండ్లు పంపుతున్నాను. నన్ను గురించి చెడుగా భావించరని తలుస్తాను. 

సం॥ శ్రీ రామరాజు.

ఇదే ఆగస్ట్ నెలలో ఒకరోజు ఉదయం, రాజుదళాన్ని కోరాపుట్ రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్ చుట్టుముట్టి కాల్పులు జరిపింది. కానీ రాజు తప్పించుకున్నాడు. ఒకప్పటి లాగా ముందే సమాచారం ఇచ్చి దాడి చేసేందుకు గానీ, పట్టపగలే పోలీసుల ఎదురుగా సంచరించేందుకు గానీ పరిస్థితులు అనుకూలంగా లేవన్న మాట వాస్తవం. అయితే.. ఒకప్పుడు రాజు తరుముతుంటే పారిపోయిన పోలీసులు, ఇప్పుడు రాజు వెంట పరిగెడుతున్నారు. పోలీస్ లకి ఆ భయం తో కూడిన పరుగు మాత్రమ్ అప్పుడూ తప్పలేదు. ఇప్పుడూ తప్పట్లేదు.  మళ్ళీ ఉద్యమ వేడి రగులుకుంది. బ్రిటిష్ సైన్యానికీ, రామరాజు సేన కీ మధ్య కాల్పులూ, ఇరువైపులా రక్తపాతం జరుగుతుంది. అప్పటికి రాజు ఉద్యమం మొదలు పెట్టి సంవత్సరం పూర్తవుతుంది.  వార్తా పత్రికలలో ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణ లో పడింది ప్రభుత్వం. యుద్ధం లో  ఉద్యమకారుల మరణానికి రామరాజే కారణమనీ, మన్యం లో రాజ్యస్థాపన చెయ్యడమే అతని ఉద్దేశ్యమనీ, దీనికీ సహాయనిరాకరణ ఉద్యమానికీ సంబంధం లేదనీ, మన్య ప్రజల ప్రశాంత జీవితాన్ని భంగపరిచినది రామరాజేననీ అప్పటి ఏజన్సీ కమిషనర్ హెప్పెల్ సరికొత్త వాదనలని తీసుకొచ్చాడు.

1923 ఆగస్ట్ 28 న ఆంధ్రపత్రిక లో ప్రచురితమైన కధనం ఇక్కడ. చదవ వచ్చు.  లేదా ఈ కింది పిక్చర్ మీద క్లిక్ చేసి చదవవచ్చు.




 బాస్టియన్ నే రాజు ఉద్యమానికి మూలకారణం అని అయిష్టంగానే ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణదేవీ పేట లో అతని మీద విచారణ మొదలైంది. అన్ని గ్రామాల పెద్దలనీ, మున్సబులనీ సమావేశ పరిచి రాజు ఫితూరీ ని అణగదొక్కడానికి  ప్రభుత్వానికి తోడ్పాటునందివ్వాలనీ, ప్రజలెవ్వరూ ఉద్యమకారులకి సహాయం చెయ్యకూడదనీ ఆదేశించింది. అదే రోజు సాయంత్రం ఆ మున్సబులందరూ, రాజుని కలిసేట్టుగా మాకవరం పొలాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు రాజు ప్రధాన అనుచరుల్లో ఒకడయిన మల్లుదొర.  రాజు పట్ల పూర్తి విశ్వాసాన్ని చూపిన మున్సబులందరూ అతనికి  సాష్టాంగపడి, ఉద్యమానికి సహాయ సహకారాలు అందించేట్టుగా తమ మద్దతు ప్రకటించారు.
ఈ సంఘటన తర్వాతనే రాజు తన ముఖ్య అనుచరుడు మరియూ గాం గంటం దొర తమ్ముడు అయిన "గాం మల్లు దొర" ని తన దళం నుండి శాశ్వతం గా బహిష్కరించాడు. ఉద్యమం మొదలు కాక ముందు నుండీ తన వెన్నంటి ఉన్న మన్యం వీరుడు మల్లుదొర. రాజువెంట అన్నవరం వచ్చిన నలుగురిలో ఒకడు. అతన్ని ఎందుకు వెలివేశాడు?? అంటే.... కారణం వ్యసనాలు. రాజు ఉద్యమం మొదలు పెట్టినప్పుడే తన సేన ఎంత క్రమశిక్షణ గా ఉండాలో, తన సిద్దాంతాలేమిటో స్పష్టం గా తెలియజేశాడు. అయితే రాజు దళం కృష్ణదేవి పేట పోలీస్ స్టేషన్ ని కొట్టిన రోజునా , ఆ తర్వాత కొన్ని సంధర్భాలలో రాజు అనుచరుడి హోదాలో డబ్బులివ్వకుండా మద్యం సేవించడం, సామాగ్రిని ప్రజల నుండి సేకరించడం మొదలైనవి చేశాడు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి ఘటనలే పునరావృతం కావడం తో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్ప లేదు రామరాజు కి. అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించలేదు. ఇదే విధంగా సరయిన కారణం లేకుండా ఒక హిందూ పోలీసు చావు కి కారణమైన గోకిరి ఎర్రేసు ని 15 రోజుల పాటు బహిష్కరించాడు రాజు.

1923 సెప్టెంబరు 17 రాత్రి....
 మల్లుదొర తన స్వగ్రామానికి దగ్గర లో ఉన్న నడింపాలెం లో తన ఉంపుడుగత్తె అయిన "సుమర్ల సింకుబుల్లి" తోఉన్నాడనీ, అతని కోసం మద్యం పట్టుకొచ్చే ఏర్పాట్లు కూడా జరిగాయనీ, నల్లగొండి మున్సబు నుండి సమాచారం రావడం తో కృష్ణదేవీపేటశిబిరం లో ఉన్న అధికారి "కీరన్స్" పోలీసులతో బయలుదేరి వెళ్ళీ మల్లు ఉన్న ఇంటిని చుట్టు ముట్టాడు. మల్లు అటక ఎక్కి ధాన్యం దాచిపెట్టే గరిసె లో దూరాడు. పోలీసులు ఇల్లంతా గాలిస్తూ ఉండగా "జామేదార్ నారాయణ్ కురూప్" గరిసెను కత్తి తో పొడవడం తో గాయమయ్యే సరికి బయటకి రాక తప్పలేదు.  మల్లు వ్యసన పరుడే కావచ్చు కానీ జగమొండి. రాజు తనని బహిష్కరించాడన్న కోపంతో పోలీసులకి రహస్యాలు చెప్పెయ్యలేదు. మల్లుదొరని కృష్ణదేవీపేట పోలీస్ స్టేషన్ లో చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి చావగొట్టారు.  ఆ హింస అక్టోబర్ 4 వరకూ సాగింది. "చనిపోవడానికి సిధ్ధం" అనే అభిప్రాయం మనసు లో ఉండొచ్చుగాక. కానీ హింస కి శరీరం సిద్ధంగా ఉండదు.....  కొన్ని రహస్యాలు బయటకి వచ్చాయి.
అక్టోబర్ 12 న ఒక ప్రకటన వెలువడింది.

"రామరాజు ముఖ్య అనుచరుడు, ఫితూరీ దార్లలో కడు సాహసి, అత్యంత అపాయకరుడు అయిన గాం మల్లుదొర పట్టుబడ్డాడు. కొత్త పధ్ధతులతోనూ, అవిరళ కృషీ వల్లనూ సెప్టెంబరు 18 , 1923వ సంవత్సరం లో వాస్తవమైన ఈ విజయం సాధించడమైనది"


మల్లుదొర దొరికిపోయినంత మాత్రాన ఉద్యమం ఆగదనీ, తమ పంధాలో మార్పుండబోదనీ గంటందొర  ప్రకటించాడు.
సెప్టెంబర్ 29 న రాజు పాడేరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. కేవలం నాలుగు తుపాకులు లభించాయి.
పోలీసుల కోసం వస్తున్న సామగ్రి, ఆహార పధార్ధాలపై రాజు దళం దాడులు మాత్రం కొనసాగుతున్నాయ్.
కాల్పులు కొనసాగుతున్నాయ్.
శిక్షా సుంకాలు విధించినా, పెంచినా, బెదిరించినా ప్రజల్లో రాజుకున్న పలుకుబడి తగ్గటం లేదు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడింది తెల్లసేన.
 ***************************************************************************
1923 అక్టోబర్ 25

గూడెం లో "హ్యూమ్" నేతృత్వం లో ఏర్పాటు చెయ్యబడిన పోలీస్ సైనిక శిబిరం ఉద్యమ విస్తృతికి ప్రధాన ఆటంకం గా మారడం తో ఆయుధాల కోసం శిబిరం పై దాడి చెయ్యాలని తలచాడు రాజు. రాజు పధకాలు ఎంత పక్కాగా ఉంటాయో చెప్పడానికి మరొక ఉదాహరణ ఇది.
ఆ రోజు రాత్రి సైనిక శిబిరం లో దాదాపు అందరూ నిద్రపోతున్న సమయం. రాజుదళం శిబిరం దగ్గరకి చేరుకుంది. తన సేన ని మొత్తం నాలుగు బృందాలు గా విభజించాడు రాజు. మొదటి బృందం శిబిరం వెనుక భాగం గుండా ప్రవేశించి ఆయుధాలు సేకరించాలి. రెండవ బృందం సాయుధులది. రాజు ఆదేశం ఇవ్వగానే తుపాకులు, బాణాలతో దాడి చెయ్యాలి. మూడవ బృందం లో ఆయుధాలు కాకుండా కేవలం డప్పులూ, డోలులు ఉంటాయ్. నాల్గవ బృందం ఆదేశం ఇచ్చినప్పుడు "మేం కూలోల్లం బాబూ.. మేం కూలోల్లం బాబూ" అని అదే పని గా అరుస్తూ ఉండాలి.
మొదటి బృందం శిబిరం లోకి ప్రవేశించింది. అయితే తుపాకులన్నీ తుపాకి స్టాండ్ కి ఒక ప్రత్యేక పద్ధతి లో అమర్చి ఉండటం తో వాటిని తియ్యడం కొండదళ సభ్యులకి తెలియ లేదు. అంతేకాక ఇలాంటి ప్రమాదాలని నివారించడానికి తుపాకులని అన్ లోడ్ చేసి, తూటాలు తలగడల కింద దాచేసి ఉంచుతున్నారు పోలీసులు. ఇంతలో పోలీసులకి మెలకువ వచ్చి విషయం అర్ధమైపోయింది. ఒక సెంట్రీ కాల్పులు మొదలు పెట్టాడు. వెంటనే రాజు తన బృందాలకి ఆదేశమివ్వటం తో బాణాలూ, తూటాలు శిబిరం లోకి దూసుకురావడం మొదలైంది. అప్పుడే హఠాత్తుగా మొదలైన డప్పుల మోత తో హోరెత్తిపోతుంది. "మేం కూలోల్లం బాబూ.. మేం కూలోల్లం బాబూ" అరుపులతో పోలీసులకి గందరగోళం గా ఉంది. సైనికాధికారులు ఇస్తున్న ఆదేశాలేవీ ఈ గోల లో వినిపించటం లేదు. బ్రిటిష్ సైన్యం ఆయుధాలతో రెడీ అయ్యే సమయానికి కొండదళం పారిపోయింది.ఆయుధాలు దొరకలేదు గానీ, కొండదళం కాల్పులలో "లాన్స్ నాయక్ హుస్సేన్" మరణించాడు.

1923 డిసెంబర్ లో కృష్ణదేవీపేట కి సమీపం లోని కిత్తలోయ లో కొండదళం ఉన్నట్టు తెలిసి పోలీసులు రైడ్ చేశారు. వారికి రాజుబృందం కనిపించ లేదు గానీ ఒక బట్టల మూట, మన్యం మ్యాప్ లభ్యమయ్యాయి. ఎప్పుడు ఎక్కడ కి ఎలా వెళ్ళాలీ? అడవి లో అందరికీ తెలియని అడ్డదారుల గురించిన ఇన్ఫర్మేషన్, పధకాలతో ఉద్యమం నడుస్తుం డటంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఉద్యమం చల్లారినట్టే కనిపిస్తుందీ... ఒకేసారి విశ్వరూప ధరిస్తుంది. ఉద్యమకారుల గెరిల్లా యుద్ధాలతో గుండెలు దడదడలాడుతున్నాయ్.

ఈ స్థితి లో అస్సాం లోని కుకీల తిరుగుబాటుని విజయవంతంగా అణచివేసిన "అస్సాం రైఫిల్స్" దళాలని మన్యానికి రప్పించాలని మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది.  మొదటి ప్రపంచ యుద్ధం లో పని చేసిన అనుభవం ఉన్న "మేజర్ గుడాల్" దీనికి అధిపతి.

సరిగ్గా గుర్తు పెట్టుకోండీ పేరు ని..."మేజర్ గుడాల్"

Monday, November 19, 2012

ఇది కధ కాదు 6 : పోరాటం సాగిందిలా...!

1922 డిసెంబర్ మాసాంతం

రాజు సేన విచ్చిన్నమయిపోయిందని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికీ, పోలీసులకీ మళ్ళీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సమాచారం కోసం వేసిన టెలీఫోన్ లైన్లని నాశనం చెయ్యడం, పోలీసుల కోసం వస్తున్న సామాన్లనీ, ఆహార పదార్ధాలనీ కొల్లగొట్టడం ద్వారా తన ఉనికిని చాటుకుంది రాజుదళం. అయితే కొండల్లో డ్యూటీ చెయ్యమని మొండికేశారు పోలీసులు. దీనికి కారణం లేకపోలేదు. మన్యం లోని వాతావరణ పరిస్థితులనీ ముఖ్యంగా ఏ సౌకర్యాలు లేని చోట చలి, వర్షం, అంటు రోగాలు, విషజ్వరలాని తట్టుకోవడం చాలామందికి దుర్లభమనిపించింది. పెద్ద మొత్తం లో ఆహారం, ఇతర సామగ్రీ, ఆయుధాలూ, ఫిరంగులూ, మందుగుండూ మోసుకుంటూ తెలియని అడవి దారుల్లో కొండలు ఎక్కుతూ దిగుతూ, ఎప్పుడు రాజుదళం చేతుల్లో చస్తారోనన్న భయం తో చాలామంది రాజీనామాలు చేశారు. అప్పటికే పోలీసుల్లో ఒక నమ్మకం ఉంది. "రాజు మంత్రమేస్తే కండిషన్ లో ఉన్న తుపాకీ కూడా పేలదని". పోలీసులు రాజుకి భయపడుతున్నారన్న విషయం రూఢీ అవ్వటమే కాకుండా, రాజు దళం తో కుమ్మక్కు అయ్యారనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి కలగడంతో రాజీనామాలని ఆమోదించి, మొత్తం పోలీసుదళాన్నే మార్చెయ్యాలన్న నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం.

అప్పటికే చాలామంది దళసభ్యులు పోలీసుల చేతికి దొరికేసినాగానీ, 1923 జనవరి లో 16 మంది తో రాజు మన్యం గ్రామాల్లో సంచరిస్తున్నాడనే వార్త మళ్ళీ హడావిడి సృష్టించింది. సుమారు 800 మంది తో కూడిన పోలీసు బృందం రాజు ఆచూకీ కోసం వెతకడం మొదలెట్టింది. అందులో భాగంగా పోలీసు సామాగ్రి మొయ్యడానికి అమాయక మన్యం ప్రజల చేతనే బలవంతం గా తీసుకెళ్ళి పనిచేయిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలని భయపెట్టీ, బతిమాలీ, సారాపోయించీ ఎలాగోలా రాజు సేన గురించిన వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.ఒక ఊళ్ళోకి రాజు వచ్చిన సంగతి ఆయన ఆ ఊరు విడిచి వెళ్ళిన తరువాతే పోలీసులకి తెలిసేది. ప్రభుత్వానికి సహకరించని అటువంటి ఊళ్ళ మీద అధిక మొత్తం లో సుంకం విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య  కొత్త సభ్యుల కోసం అన్వేషిస్తూ, గిరిజన గ్రామాలని తట్టి లేపుతూ మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసే పనిలో పడ్డారు రాజు, అతని అనుచరులు...!

*********************************************************************************
1923 ఏప్రియల్ 17
అన్నవరం లో అడుగెట్టిన అల్లూరి

ఆయుధాల కోసం అన్నవరం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు రాజు. కేవలం నలుగురు అనుచరులతో.
చెరుకూరి నరసింహ మూర్తి అనే గృహస్థుకి ప్రజలు పరిగెడుతూ కన్పించడం, కారణం అల్లూరి శ్రీరామరాజు రాక అని తెలియడం తో ఆయన స్వయం వెళ్ళి రాజుని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. రాజు ఎలా ఉన్నాడూ? ఎంత వయసు? అతని మాటల్లో మర్యాద ఎలాంటిది? అతని అలవాట్లేమిటీ? అతని అనుచరులెలాంటి వారు? ఉద్యమం మీద రాజు అభిప్రాయాలేమిటీ? మన్యం బయట గ్రామాల్లో కూడా రాజు కి ఎంతటి ప్రజాకర్షణ ఉన్నదీ? మొదలైన విషయాలన్నీ ఆ తర్వాత ఆయన ఆంధ్రపత్రిక విలేఖరి ని కలిసి చెప్పడం తో 1923 ఏప్రియల్ 21 నా "ఆంధ్రపత్రిక" లో అన్నవరం ఘటన గురించిన పూర్తి కధనం ప్రచురించబడింది. (తప్పని సరిగా చదవవలసిన ఆర్టికల్ ఇది)

(ఆ రోజు వార్తా పత్రిక ని ఇక్కడ చదవవచ్చు. లేదా కింద స్క్రీన్ షాట్స్ లో చూడవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేయండి.)

(head line)


(వార్త)






 










 రాజు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గమనించినట్లయితే.. గయ లో జరిగిన సమావేశాన్ని, స్వయంగా వెళ్లక పోయినా, తన సూక్ష్మ శరీరం ద్వారా  చూశానని చెప్పాడు. తన తపశ్శక్తి ద్వారానో, యోగ విద్య ద్వారానో అటువంటి స్థితి కి చేరుకోగలిగాడేమో అనిపిస్తుంది. ఒకే సమయం లో రెండు చోట్ల రామరాజు ఉన్నట్టు బలమైన సాక్షాలు ఉండటం, తప్పించుకోడానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా శత్రువు నుండి తప్పించుకోవటం మొదలైన వాటికి కారణం ఇదీ సరిగ్గా చెప్పలేం. రాజుకి నిజంగా దివ్య శక్తులున్నాయన్న నమ్మకం మాత్రం ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ బలంగా ఉన్నాదనీ ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అయితే పోలీసులని చిత్తు చెయ్యడానికీ, భయపెట్టడానికీ రాజు వేసిన పధకాలుగా కూడా అనుకోవచ్చు. మరొక సంగతేంటంటే వార్త హెడ్ లైన్స్ లో "అల్లూరి సీతా రామరాజు" అని వేశారు. అప్పటికి గిరిజన కార్యకలాపాలన్నీ భద్రాచలం నుండే నిర్వహించేవారు. భద్రాచలంలో సీతారాముల వారి గుడి ఫేమస్ అవ్వడంతో  బ్రిటిష్ వారికి "సీతారాముడు" అనే పేరు తో ఎక్కువ పరిచయం. ఈ కారణం గానే శ్రీ రామరాజుని  సీతా రామరాజు గా పిలిచారనీ, అదే అందరికీ అలవాటయ్యి ఆ పేరు స్థిరపడిందని  ఒక వాదన ఉంది. రాజు కి ఎంతో ఇష్టమయిన తన చెల్లెలు "సీత" పేరు ని తన పేరులో కలుపుకున్నాడన్న వాదన కూడా ఉంది. అయితే రాజు రాసిన ఉత్తరాలలోనూ, సెర్టిఫికేట్స్ లోనూ "అల్లూరి శ్రీ రామరాజు" అని మాత్రమే ఉంది.

అన్నవరం పోలీస్ స్టేషన్ లో తుపాకులు,మందుగుండూ లభించలేదు గానీ కత్తులు మాత్రం స్వాధీన పరచుకున్నాది రాజు బృందం. రామరాజుని సబ్ ఇన్స్పెక్టర్, పోస్టుమాస్టర్, డిప్యూటీ తహశీల్దారులు  తమ ఇళ్ళకి ఆహ్వానించారు. వారింట స్త్రీలు ఆయన కాళ్ళు కడిగి గౌరవించారు. రాజు సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాక ప్రజలు రాజుకి బట్టలు పెట్టారు. ఫలాలు, కొంత డబ్బు ఇచ్చారు. రాజు వెనక ఉన్న ఆ నలుగురి లో ఆ రోజు గాం గంటందొర, అతని సోదరుడు గాం  మల్లుదొర కూడా ఉన్నారు. రాజు అన్నవరం విడిచి వెళ్ళిపోయాక వచ్చిన అధికారులు, ప్రజలు అతనికి బ్రహ్మరధం పట్టారన్న విషయం తెలుసుకొని అన్నవరం మీద Rs 4000 ల శిక్షా సుంకం విధించారు.

అయితే.. రాజు కీ, అతని ఉద్యమానికి ప్రజల మద్దతు ఎంతగానో ఉందనీ, ఒక్క ఎదురుదెబ్బకి భయపడి రామరాజు తన పోరాటాన్ని ఆపే ఆలోచనలో లేడనీ, ఇది సోమవారం మొదలెట్టి శుక్రవారం ముగింపు పలికే ఉద్యమం కాదనీ ప్రభుత్వానికి తెలిసొచ్చింది అన్నవరం ఘటన వల్ల.

**********************************************************************************

1923, మే నెల
 రాజుదళం లోకి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వేగిరాజు సత్యనారాయణ రాజు అనే వ్యక్తి సేనాని గా ప్రవేశించాడు.
మన్యం ప్రజల తిరుగుబాటు కి కారణం, కఠిన అటవీ చట్టాలతో పాటూ "బాస్టియన్" విధానాలే కారణం అని భావించింది ప్రభుత్వం. అయిష్టంగానే బాస్టియన్ ని నెల్లూరికి బదిలీ చేసి అతని స్థానం లో "కందర్ప మూరెన్న పంతులు" ని నియమించింది. సుంకం వసూలు కోసం కొయ్యూరు వచ్చిన అతన్ని రాజు అనుచరులు కిడ్నాప్ చేసి గంటందొర దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఉద్యమం ఉద్దేశ్యం, దానికి గల కారణాలని వివరించి అతన్ని వదిలేశాడు గంటందొర.అంతేకాక స్వతంత్ర పోరాటం కోసం ప్రతీ గ్రామాన్నీ తట్టిలేపడం, ఉద్యమకారులని పట్టిస్తున్న గ్రామ మున్సబులని శిక్షించడం, నాటు తుపాకీలని సేకరించడం మొదలైన  కార్యక్రమాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా విప్లవకారులని ప్రభుత్వానికి పట్టించిన ఈబోలు గ్రామ మున్సబు చెవి నరికేశాడు అగ్గిరాజు. జూన్ 8 నాటికి 30 మంది, జూన్ 17 నాటికి 60 మంది రాజుబృందం లో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. రాజు విధానాలకి ఆకర్షితులైన మైదాన ప్రాంత ప్రజలు కూడా ఉద్యమం లోకి వచ్చి చేరుతున్నారు.

రామరాజు సేన పఠిష్టమయ్యే దిశ గా అడుగులు వేస్తుంది....!!!

Thursday, November 15, 2012

ఇది కధ కాదు 5 : ఫిరంగి దెబ్బ

రాజుదళం సాగుతుంది. విజయ పరంపర తో... గర్వంగా...!
అప్పటి వరకూ చేసిన దాడులన్నీ దొంగచాటుగా కాదు. "ఈ రోజు మీ పై దాడికి వస్తున్నాం" అని ముందే చెప్పి, పెట్టిన ముహూర్తానికి బయలుదేరి చెప్పిన చోటుని కొట్టినవే. అయితే ఈ సారి పోలీస్ యంత్రాంగం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న మాట వాస్తవం.

1922 అక్టోబరు 15
బ్రిటిష్ పోలీస్ అధికారగణాలు మోహరించిన ముఖ్య కేంద్రాలలో ఒకటి  "అడ్డతీగల" పోలీస్ స్టేషన్.
 డెబ్బై మైళ్ల దూరం అడవి లో ప్రయాణం చేయాలి అక్కడకి చేరాలంటే."అడ్డతీగల" పోలీస్ స్టేషన్ ని కొట్టబోతున్నాననీ, చేతనయితే ఆపుకోమనీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బ్రేకన్ కీ,  ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారి "సదావర్తి ఆదినారాయణ" కీ ముందే సమాచారం అందించాడు రాజు. రాజు దండు ని ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే స్టేషన్ లోని ఆయుధాలన్నీ ముందే దాచేశారు. స్టేషన్ ఖాళీ చేసేసి పోలీసులంతా పారిపోవటం తో రాజు బృందానిది వృధా ప్రయాస అయింది. ఆ రోజు రాత్రి తొంబై మంది సభ్యులతో రాజు స్టేషన్ లో బస చేసినప్పుడు గానీ, మర్నాడు వాగులో స్నానం చేస్తున్నప్పుడు గానీ రాజు యొక్క ప్రతీ కదలికా పోలీసులకి తెలుస్తూనే ఉంది.తను ఎన్ని గంటల వరకూ అడ్డతీగల లో ఉంటాడో కూడా రామరాజు ముందే చెప్పాడు. కానీ రాజుని ఎదుర్కొనేంత ధైర్యం గానీ, రాజుదళం తో పోరాడే తెగువ గానీ తెల్లదళం లోని ఏ పోలీసు కీ లేదు. అంతకు ముందు జరిగిన ఫితూరీ లలో ఆ పోలీస్ స్టేషన్ మూడు సార్లు ధగ్దమయ్యింది. ఒక్క అగ్గిపుల్ల గీసి తగలెట్టెయ్యడం చిటికె లో పని. కానీ ఉద్యమం లో విధ్వంసం ఒక సంస్కృతిగా పెరిగి పెద్దది కావడం రాజు ఉద్దేశ్యంకాదు. రాజు ఉద్దేశ్యమే రాజుదళానికి ఆజ్ఞ. ఆసుపత్రి నుండి అవసరమైన మందులు మాత్రం తీసుకొని చోడవరం ప్రయాణమయ్యాడు.

1922 అక్టోబరు 19
మాట్లాడే పని ఉందని రాజు స్వయంగా పిలిచినా గానీ ధైర్యం చేయని కలెక్టర్ బ్రేకన్, తహశీల్దార్ అప్పలనర్సయ్య పంతులు ని, చోడవరం చేరిన రాజుతో మంతనాల కోసం పంపించాడు. అప్పలనర్సయ్య కి రాజుతో గతం లోనే పరిచయం ఉండటం తో ఈ ఉద్యమం ఉద్దేశ్యమేమిటి? స్వాతంత్ర్యం మీ ఒక్కరి వల్లా సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించాడు.
"వ్యాపారం కోసం వచ్చిన వలసదారులు, మనలో ఐక్యత లోపించిన విషయాన్ని పసిగట్టి, లోకువగట్టి, ఆర్ధికంగా, రాజకీయం గా, శక్తిని కూడగట్టుకొని అధికార బలంతో భారత జాతి మీద సవారీ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మార్గాలలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంది. అందులో అతివాద ధృక్పదం తోనే నేను ఉన్నాను. మన్యం పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ శాంతియుత పోరాటం పనికిరాదు. రక్తపాతం తప్పదు. ఇది ఆరభం మాత్రమే. అసలు పోరాటం మొదలైనప్పుడు నేను లేకపోయినా నా అనుచరులు ఉద్యమాన్ని నడిపిస్తారు" అని సమాధానం చెప్పాడు రాజు. భారతీయుల సహాకారం వల్లే తెల్లవాళ్ళు ప్రాణాలతో బతికున్నారనీ, పరిపాలిస్తున్నారనీ తేల్చి చెప్పాడు. తాను పట్టుకొచ్చిన అరటి పళ్లని రాజు కి సమర్పించి, నమస్కరించి వెళ్ళిపోయిన తహశీల్దార్, చర్చా నివేదిక ని కలెక్టర్ కి పంపించాడు.
 అదే రోజు చోడవరం స్టేషన్ పై దాడి చేశాడు రాజు. సిబ్బంది మొత్తం అతనికి సాష్టాంగ పడిపోయారు. అయితే ఎటువంటి ఆయుధాలూ దొరకక పోవటం తో స్టేషన్ సిబ్బంది తో మాట్లాడి, సాయంకాలం వెళ్ళిపోయాడు. సమీపంలోకి వచ్చినా రాజుని అరెస్ట్ చేయనందుకు పోలీసుల మీద దర్యాప్తు మొదలైంది.

నాలుగు రోజుల తర్వాత....
రామవరం లో సాండర్స్ నాయకత్వం లోని సేన రాజుదళం తో తలపడింది. ఫలితం అప్పటికి వరకూ తెల్లసైన్యానికి అలవాటు అయినదే. "దొరికిపోవటం, చచ్చిపోవటం, చావు తప్పించుకు పారిపోవటం." బ్రిటిష్ సేన లోని కెప్టెన్ స్టువర్ట్ మాటల్లో చెప్పాలి అంటే " రాజు వ్యూహాలు ఊహలకి అందవు. తను ఎక్కడ ఉన్నాడో ముందే సమాచారం పంపుతాడు. పోలీసులు పట్టుకోడానికి బయలు దేరుతారు. అయితే అదంతా గొప్ప పధకం. పోలీసులు వెళ్లేసరికి అక్కడ ఎదుర్కోడానికి సిధ్ధంగా కాపుకాసి ఉంటాడు. పోలీసులు అతని వల లో ఇరుక్కుపోతారు".
ఇదే అక్టోబరు నెలలో ఏజన్సీ లలో ఎక్కువగా వచ్చే విషజ్వరాలు విలయతాండవం చెయ్యడంతో కొన్నాళ్ళు ఇరుపకక్షాలూ పోరాటం ఆపవలసిన పరిస్థితి వచ్చింది. పెంచిన పోలీసు దళం కోసం ఆస్పత్రులు, వాహనాలు, ఇతర పరికరాలు ఏర్పాటు చెయ్యవలసి వచ్చింది.
************************************************************************

1922 నవంబరు
రామరాజు ఆచూకీ కోసం గాలిస్తున్న నిత్యానంద పట్నాయక్ అనే పోలీస్ అధికారి రాజు దళానికి దొరికాడు. ఏయే ఊళ్ళలో ఎంత పోలీసు బలగం ఉందో అతని ద్వారా తెలుసుకొన్నాడు రాజు. "తమ ఆచూకీ కోసం గ్రామ పెద్దలని బెదిరించినా, ప్రజలని వేధించినట్లు తెలిసినా, అది ఎవడయినా సరే.. ప్రాణాలు తీస్తా..! " నని హెచ్చరించి వదిలేశాడు. పట్నాయక్ మాటల ప్రకారం శ్రీ రామరాజు అప్పుడు తన కొలువు లో ఎలా ఉన్నాడంటే...
"రాజు ఖాకీ నిక్కరు, చొక్కా వేసుకొని మంచం మీద కూర్చొని ఉన్నాడు. పక్కనే 303 తుపాకీ ఉంది. మరో పక్క మంచం మీద 303 రైఫిల్స్, బాణాలు ఉన్నాయి. చుట్టూ ఎనభై మంది దాకా ఉద్యమకారులు ఉన్నారు"
***************************************************************************

అనుమానమున్న గ్రామప్రజలని విచారిస్తున్నా, రాజు ఉద్యమానికి మద్దతిచ్చిన గ్రామాలపై అధిక సుంకాలని విధిస్తున్నా, బెదిరిస్తున్నా గానీ ప్రజలంతా రాజు కి సహాయం చెయ్యడం, పోలీసులు రాజుకి భయపడటం ప్రభుత్వాకి తలనొప్పిగా తయారయ్యింది.

నవంబరు నెలాఖరు నాటికి స్పెషల్ పోలీస్ దళాలు వేల సంఖ్యలో పెరిగాయి. యుధ్ధాలలో వాడే లూయీ ఫిరంగులు వచ్చి చేరాయి. సమాచారం కోసం వైర్ లెస్ సెట్లు దించారు. టెలీఫోన్ లైన్స్ వేశారు{అయితే టెలీఫోన్ వ్యవస్థని రాజుదండు నాశనం చేసింది.}. చిన్నా చితకా స్టేషన్లలో కూడా ఆయుధాలు, డబ్బు ఉంచకుండా ఏర్పాట్లు చేశారు. అందువల్ల పోలీస్ స్టేషన్ల పై రాజు చేస్తున్న దాడులన్నీ వృధా అయ్యాయి.
అంటే గత కొన్ని నెలలుగా కళ్ల ఎదుట కనిపించి సవాలు చేస్తున్నా రాజు ని అరెస్ట్ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న తెల్లవాళ్లకి అతన్ని  ఎదుర్కోడానికి అనుకూల పరిస్థితులు వచ్చాయి.
కానీ 1922 డిసెంబరు నెలనాటికి రాజు ఆరోగ్యం పాడయ్యిందనీ, దళం లో చీలికలు వచ్చి కొందరు ఉద్యమకారులు బయటకి వచ్చేశారనీ వదంతులొచ్చాయి.

అదే డిసెంబరు లో జరిగిందో సంఘటన. వరుస విజయాలతో తెల్లోళ్ల గుండెల్లో గుబులు పుట్టించి పరుగులు పెట్టిస్తున్న రాజుసేన కి ఒక చేదు అనుభవం. రామరాజు పౌరుషాన్నీ, ప్రతాపాన్నీ, పోరాటపటిమనీ చూసి మురిసి పోతున్న మన్యం ప్రజల్లో మళ్ళీ భయాందోళనల బీజం నాటిన ఘటన.

1922 డిసెంబర్ 6
రామరాజు దళం ఆచూకీ కోసం తమ బెటాలియన్ తో వెతుకుతున్న జాన్, చార్స్లీ  అనే అధికార్లకి రాజు దళం లోని ఇద్దరు సభ్యులు చిక్కారు. పోలీసు చిత్ర హింసల తో రాజు "పెదగడ్డ పాలెం" లో ఉన్నాడన్న సంగతి వారినుండి రాబట్టారు. బెటాలియన్ పెద్దగడ్డపాలెం వైపు ఫిరంగులతో దారి తీసింది. రాజు సేన తమ స్థావరం నుండి బయటకొచ్చి వరిపొలాలు, నిలువెత్తు జొన్న చేను, చింత తోపుల చాటు నుండి యుద్ధం చెయ్యడం మొదలెట్టింది.  కానీ ఫిరంగులకి ఎదురు నిలిచి తుపాకుల తో యుద్ధం చెయ్యడం కష్టమవ్వడం తో రాజుసేన ప్రాణరక్షణ కోసం పారిపోవాల్సి వచ్చింది. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది ఉద్యమకారులు మరణించారు. మందుగుండు సామాను, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పారిపోయిన వారి కోసం స్వెయిన్ నేతృత్వం లో వేట మొదలైంది. రాజు స్థావరం లింగాపురం లో ఉన్నదన్న సమాచారం రాబట్టింది తెల్లదళం. పగలంతా తిండి లేకుండా యుద్ధం చేసి, అలసి, నీరసించి పోయిన రాజు సేన లింగాపురం లోని తమ స్థావరం లో విశ్రాంతి తీసుకుంటున్నారు. చీకటి పడింది. ముందే చెప్పి దాడి చెయ్యడం రాజు నైజమేమో గానీ తెల్లసైన్యానికి అటువంటి నీతులేమీ లేవు.  పహారా కాస్తున్న వాళ్ళని మట్టుబెట్టి, స్థావరాన్ని మూడువైపుల నుండి చుట్టు ముట్టింది పోలీస్ దళం. ఆ రాత్రి... ఆ చీకట్లో అప్రతిహతంగా జరుగుతున్నాయి కాల్పులు. పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు ఉద్యమకారులు. బ్రిటిష్ సైన్యం ఆ రోజు ఎంత పైచేయి సాధించిందంటే రాజు పరుపు మొత్తం చిల్లులు పడిపోయింది తూటాల దెబ్బకి. తెల్లారేసరికి మరో ఎనిమిది మంది కొండదళ సభ్యులు మరణించారు. అయితే... ఎలా సాధ్యమయ్యిందో తెలీదు... మిగిలిన అనుచరులతో రాజు తప్పించుకున్నాడు.
 ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే రామరాజు తన పక్క మీద కాక వేరొక చోట నిద్రపోయేవాడు. యుద్ధ తంత్రాలలో అదొక భాగం.

చనిపోయిన ఉద్యమకారుల శవాలని ఊరేగిస్తూ.. "ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తే.. ఎవ్వడికయినా ఇదే గతి"
అని బెదిరించి, తమ మొదటి విజయం తో బలంగా చాటి చెప్పింది తెల్లదళం.

"శ్రీ రామరాజు ని పట్టి ఇచ్చిన వారికి Rs.1500, దళ సభ్యులని గానీ తుపాకీలని గానీ పట్టి ఇచ్చిన వారికి Rs.50 బహుమతి. ప్రజలంతా ప్రభుత్వాదేశాలని శిరసావహించాలి. "కాదూ..కూడదూ" అంటే రాజు దళం నాశనమయ్యేంత వరకూ స్పెషల్ పోలీసు బలగాలు గ్రామాల లోనే ఉంటాయ్. వారి ఖర్చంతా ప్రజలే భరించాలి" . ఈ ఆదేశాన్ని ప్రతీ గ్రామానికీ జారీ చేసింది ప్రభుత్వం.

ప్రభుత్వానికి సమాచారం అదించటం లేదన్న నెపంతో చాలామంది మున్సబులపై కేసులు నమోదయ్యాయి. అయితే తలలకి వెల అనే పథకం కొంతవరకూ పని చేసింది. ఎంతయినా డబ్బు పాపిష్టిది కదా..! కొందరు మున్సబులు దళ సభ్యులని పట్టించే పనికి శ్రీకారం చుట్టి, ఉద్యమానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మిగిలిన సాధారణ ప్రజానీకం నిశ్శబ్దం గా ఉంది..!
పోలీసులకి ధైర్యమొచ్చింది. రాజు , అతని ప్రధాన అనుచరులు, మరికొంతమంది తప్ప తక్కిన వారు మరణించడం, దొరికిపోవటం జరిగిందని పోలీసులు భావించారు. లభించిన ఘన విజయానికి వేడుకలు జరుపుకున్నారు. ఎక్స్ట్రా ఫోర్స్ నీ, పరికరాలనీ వెనక్కి పంపించెయ్యొచ్చనే ఆలోచనలో ఉంది తెల్లసేన..!

రాజు ఏమయిపోయాడో...ఎక్కడ ఉన్నాడో... తెలీదు.
ఉద్యమం చితికి పోయినట్టేనా??
అంతేనా ఇక???

పోరాటం ఆగిందా?? కొనసాగిందా??

Monday, November 12, 2012

ఇది కధ కాదు 4 : విప్లవాగ్ని రగిలింది.

విజయానందంతో గిరిజన గ్రామాలన్నిటినీ పర్యటిస్తున్న రాజు సైన్యానికి ప్రజల నుండి గొప్ప స్పందన లభించింది.
అడుగు పెట్టిన ప్రతీ చోటా "స్వాతంత్ర్య సమరం" గురించీ, దాని ఆవశ్యకత గురించీ, తాము సాధిస్తున్న విజయాలని గురించి ప్రజలకి తెలియజేస్తున్నాడు రామరాజు.ఎక్కడ బస చేసినా సరే, ఆ గ్రామ మునసబులు, సమీప గ్రామాల మునసబులు, ప్రజలు, బియ్యం, వంట సామగ్రి, బట్టలు, కోడి, మేక వంటివి కొండదళానికి పంపిస్తున్నారు. సిరిబలి, కిలంకోట లమీదుగా సెప్టెంబరు 3 వ తేదీ నాటికి పాడేరు సమీపం లోని "ఒంజేరి" చేరుకున్నారు.
అప్పుడు జరిగిందో సంఘటన.

ఐదు ఏనుగుల మీద సామాగ్రి తో సుమారు ముప్పై మంది పోలీసులు అటువైపు వస్తున్నారని సమాచారం అందింది. రాజు దళం అటాక్ చేసింది. పోలీసుల నుండి ఎదురు కాల్పులు జరిగాయ్. కానీ రాజుదండు ధాటికి పోలీసులు తోకముడిచి పరుగులు పెట్టారు. ఒక పోలీస్ మరణించాడు. ఏనుగుల మీద ఉన్న పెట్టెల లోని బట్టలు, కంబళ్ళు,ఇతర సామాగ్రి  అక్కడికక్కడే తన వాళ్లకి పంచి పెట్టాడు రాజు. మన్యం వీరుల ఖాతా లో మరో విజయం.

రాజమండ్రి నుండి వెలువడే "గోదావరి పత్రిక", నెల్లూరు నుండి "ఆర్యావర్తనము", "న్యాయదీపిక", "ఆంధ్ర పత్రిక" మొదలుకొని తెలుగు పత్రికలన్నీ రామరాజు పోరాటాన్ని గురించీ, దానికి సంబంధించిన విశ్లేషణలనూ ప్రచురించాయి. కానీ ఆ తరువాత కాలంలో "కాకినాడ నుండి వెలువడే ఆర్యపత్రిక" మొదలైన కొన్ని మాత్రమే ఎక్కువగా కధనాలని రాసింది.

*******************************************************************
తూర్పుగోదావరి జిల్లా,"తుని" వీధులలో "పేరిచర్ల సూర్యనారాయణ రాజు" అనే వ్యక్తి కోసం రామరాజు మనుషులు వెతుకుతున్నారు. వారి చేతుల్లో ఒక ఉత్తరం. అది స్వయంగా రామరాజు , తన మిత్రుణ్ణి పోరాటం లోకి ఆహ్వానిస్తూ రాసిన ఉత్తరం.

మిత్రమా!
              నేను యుద్దమును ప్రారంభించితిని. ఇంతవరకూ  నాలుగు ప్రదేశములలో మన సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని ఓడించినది. రామరాజు మూడు పోలీస్ స్టేషన్లు కొట్టాడు. అయితే ఉత్తరం లో పేర్కొన్న ఆ నాలుగో విజయం ఏదో అస్పష్టం. ప్రతి పోరాటమునను భగవానుని దయవలన జయము మన పక్షమునకే లభించినది. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకొని నీవు బయలుదేరి రావలెను. మృత్యువు, జననమును వెన్నంటియే యుండును.ప్రతి మానవుడు తన వంతు వచ్చినప్పుడు మరణించవలసినదే. కర్మ పరిపక్వమై, కాలము సమీపించిన,ఎక్కడున్నను ఏ మానవుడు మరణించడు? ఎంత శ్రద్ధతో ఈ శరీరమును పెంచి పోషించిననూ ఒకరోజు అది నాశనము కావలసినదే. మానవ శరీరములు శాశ్వతములు కావు. కానీ కీర్తి, అపకీర్తి శాశ్వతములు. మంచి, చెడులు చిరకాలము నిలుస్తాయి.క్షత్రియులకు యుద్ధము సహజము. ఎవరైతే జయాపజయములను, కష్ట సుఖములను చీకటి వెలుగులను చూడగలరో వారే ఆత్మ సాక్షాత్కారము పొందగలరని భగవద్గీత బోధించుచున్నది.మనకు యుద్ధం లో విజయము లభించిన ఎడల భౌతికానందము పొందగలము. యుద్ధం లో మరణించిన ఎడల మనము వీరస్వర్గము నలంకరించి ఆనందించగలము. అందువలన ఈ విషయములన్నిటినీ నేను జాగ్రత్తగా ఆలోచించి, దేశ క్షేమము కొరకు యుద్ధము అనివార్యమని పూర్తిగా విశ్వసించి ఈ సమరమును ప్రారంభించినాను. ఈ ఉత్తరము చేరిన వెంటనే నీవు తప్పక బయలుదేరి వస్తావని పూర్తిగా నమ్ముచున్నాను. ఇంకను ఎవరైనా వస్తే నీతో తీసుకొని రావలెను. ఒకసారి నీవు బయలుదేరి వచ్చి, ఇచ్చట నేను పోరాటమును సాగించుటకు చేసిన ఏర్పాట్లు చూడవలెను. అవి నీకు నచ్చకపోయిన ఎడల తిరిగి వెళ్ళిపోవచ్చును. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అక్కడ పేకేటి వారి అబ్బాయి ఉంటే తప్పక నీతో తీసుకొని రావలెను. మిత్రులకు నా అభినందనలు.

-సం॥ అల్లూరి శ్రీరామరాజు.

ఈ ఉత్తరం చేరాల్సిన చోటకి చేరి ఉంటే, అందాల్సిన సహకారం అంది ఉంటే వేరేలా ఉండేదేమో. కానీ అప్పటికే ఏజన్సీ ప్రాంతాల మీద, ఆ ప్రాంతాల నుండి వచ్చిన మనుషుల మీద నిఘా పెట్టడమూ, పోలీసు శిబిరాలూ, చెక్ పాయింట్ల సంఖ్య పెంచడం తో రామరాజు మనుషులు పోలీసులకి చిక్కారు. వారితో పాటూ ఈ ఉత్తరం కూడా. దానికి ఇంగ్లీష్ అనువాదం పై అధికారులకి పంపించబడింది. వీరే కాకుండా దళానికి ఆహారం సమకూర్చుతున్న మరికొందరు పోలీసుల చేతికి చిక్కారు. జరిగిన దాడుల గురించిన విషయాలు రాబట్టారు.  రామరాజు ఆలోచనలు,వ్యూహాలు, విజయాలు వెరసి విషయ తీవ్రత, ప్రభుత్వానికి అర్ధమయ్యింది. ఇది ప్రభుత్వం మీద యుద్దం అని భావించింది.
************************************************************************

సమయం: 1.30Pm
ప్రదేశం: నర్సీపట్నానికి 25 కిలోమీటర్ల దూరం లోని ఘాటీ.
కమాండర్ ట్రెమన్ హౌర్, గూడెం డిప్యూటీ తాహశీల్దార్ బాస్టియన్  కొంత సైన్యం తో కలిసి, రామరాజు దళం ఆచూకీ వెతుకుతూ, తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న రామరాజు వ్యూహం సిద్ధం చేశాడు.
అదును చూసి కాల్పులకి సంజ్ఞ చేశాడు రాజు. యుధ్దం మొదలైంది. ఇరువైపుల నుండీ తుపాకీ మోతలతో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లింది. బ్రిటిష్ సైన్యం చేతులెత్తేసింది. కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా, మరికొందరు ప్రాణాలు చేత్తో పట్టుకొని దొరికిన దిక్కుకి పారిపోయారు. కమాండర్ ట్రెమన్ హౌర్ తూటా దెబ్బ రుచి చూశాడు.
మన్యం ప్రజల ఆవేదనకీ, ఆక్రోశానికీ ప్రధాన కారణమయిన బాస్టియన్ కి ఆరోజు ఆఖరి రోజు అవ్వవలసింది. అతనికి గురిచూసి విసరబడిన ఒక కత్తి నుండి వెంట్రుక వాసిలో తప్పించుకొని పారిపోయాడు. ఆ కత్తి విసిరింది వేరెవరో కాదు బాస్టియన్ ఎవరి మీదయితే తప్పుడు కేసులు బనాయించి తన మున్సబు పదవిని పోగొట్టాడో, ఎవడైతే  సొంత భూమికోసం తన కాలితో తన్నులు తిన్నాడో.. ఆ గిరిజన నాయకుడు..రామరాజు ప్రధాన అనుచరుడు
"గాం గంటందొర".
**********************************************************************

ఉద్యమ అణచివేతకు ప్రయత్నాలు ఎక్కువ అయ్యాయి.కొయ్యూరు, కృష్ణదేవీపేట, గుర్తేడు, పెదవవలస, గూడేం, చింతపల్లి, లంబసింగి, మంప, ఇలా అనుమానమున్న ప్రతీ చోటా పోలీసు శిబిరాలు ప్రతీ శిబిరానికీ 50 మంది జవానులు ఆధునిక ఆయుధాలతో ఏర్పాటు చెయ్యబడ్డారు.

మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న అనుభవం ఉండటమే కాక, కేరళలోని మలబార్ అల్లర్లని అణచేసి వచ్చిన "నైవెల్లి హైటర్" నీ, తిరుగుబాట్లని తొక్కెయ్యడంలో సిధ్దహస్తుడని పేరున్న "స్కాట్ కవర్ట్" లని రంగం లోకి దించింది బ్రిటిష్ ప్రభుత్వం.

1922 సెప్టెంబర్ 24

ఆ రోజు రాజుదళం కృష్ణదేవి పేటకి ఆరున్నర మైళ్ల దూరం లో ఉన్న "దామనపల్లి ఘాట్" లో ఉందన్న సమాచారం హైటర్, కవర్ట్ లకి తెలిసింది. వారిద్దరి నేతృత్వం లో పోలీసులు బయలుదేరారు.  అయితే ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడానికి రాజుదళం లో ఏర్పాట్లు ఉన్నాయ్. పోలీస్ బెటాలియన్ వస్తుందన్న సంగతి రాజుదండు కి మున్సబ్ తమ్ముడు బొర్రంనాయుడి ద్వారా చేరవేయ బడింది.

సుమారు మూడొందల మంది పోలీసులతో బ్రిటిష్ పటాలం నాలుగు వరసల్లో కదలివస్తుంది. ముందు యాభైమంది అడ్వాన్స్ పార్టీ, తర్వాత నల్ల పోలీసు(ఇండియన్స్) దళం. ఆ వెనక హైటర్,  కవర్ట్స్, వెనకాల మిగిలిన పోలీసులు. అందరూ సాయుధులు. కానీ భయం భయం గా, పది మైళ్ళ పొడవున్న ఆ సన్నని కాలిబాటలో అడుగులు వేస్తున్నారు.

అప్పటికే గొరిల్లా యుద్ధం లో ఆరితేరిపోయాడు రామరాజు. మొత్తం ఐదు గ్రూప్ లు గా తన దళాన్ని విడగొట్టి వేరు వేరు చోట్ల మొత్తం దళాన్ని చుట్టుముట్టే విధంగా వ్యూహం పన్నాడు. హఠాత్తుగా రాజుదళం నుండి రెండు రౌండ్లు పేలాయ్. మొదటి రౌండ్ కి తూటా కవర్ట్ కణతలోకి దూసుకు పోయింది. రెండవ రౌండ్ కి తూటా  హైటర్ భుజంలోకి చొచ్చుకుపోయింది. బ్రహ్మాస్త్రాలని బ్రిటిష్ ప్రభుత్వం దించిన ఆ ఇద్దరి ప్రాణాల్ని చిటికెలో గాల్లో కలిపేసిన వాడు - విలువిద్య లో మొనగాడైన "గోకిరి ఎర్రేసు". అంతే... మొత్తం బ్రిటిష్ సైన్యం అంతా తప్పించుకునే వీలు లేకుండా చుట్టూరా కాపు కాసిన రాజు దళానికి దొరికేసింది.
ఏ ఒక్క భారతీయుడూ చంపబడకూడదు.. అన్న నియమానికి రాజు కట్టుబడి ఉండకపోతే , "ఊ... చంపెయ్యండి" అని రాజు ఒక్క మాట అని ఉంటే, ఆ రోజు అక్కడ నరమేధం జరిగుండేది. పచ్చని అడవి ఎర్రబడేది. ధామన్ ఘాట్ లోని వాగులో నీటికి బదులు రక్తం ప్రవహించి ఉండేది. ఎటువైపు నుండి బాణం వస్తుందో తెలిసేలోగా శరీరం లోకి దిగబడేది. దిగిందని తెలిశాక, గొంతు లో కేక గాల్లోకి చేరే లోగా ప్రాణాలు పోయుండేవి. అదే అవకాశం పోలీసు దళానికి వచ్చి ఉంటే రాజు దళం లోని ఏ ఒక్కరూ బ్రతికి ఉండేవారు కాదు. రామరాజు మాత్రం శత్రు సైన్యం లో ఉన్నా కూడా వారిలో భరతమాత బిడ్డల్నే చూశాడు. యుద్ధం మొదలైన కొద్ది నిమిషాలలో జరిగిన అలజడిలో మరో ఇద్దరు పోలీసులు మరణించగా, కొందరు గాయపడ్డారు. మొత్తం ఆయుధాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. ప్రాణాలు మాత్రం విడిచి పెట్టబడ్డాయ్. ఇద్దరు పోలీసులని మాత్రం కొండదళం బందీలుగా తీసుకెళ్ళారు. ఆ ఇద్దరు పోలీసుల ద్వారా వశపరచుకున్న "303 రైఫిల్స్" నీ, ఇతర ఆయుధాలనీ వాడే పద్ధతిని నేర్చుకుంది రాజుబృందం. వారు ఉన్న రెండ్రోజులూ భోజన సదుపాయాలతో మర్యాద గా చూశాడు రాజు. తర్వాత వారిని కూడా విడిచి పెట్టేశాడు.

అయితే చనిపోయిన హైటర్, కవర్ట్ ల శవాలు ఏమయిపోయాయో తెలియలేదు. కవర్ట్ కి అత్యంత సన్నిహితుడైన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ "అర్మిటేజ్" స్వయంగా బయలుదేరి వచ్చాడు. కొండదళాన్ని ఢీకొట్టడానికి బెటాలియన్ తో రెడీ అయ్యాడు. ఈ సారి జరిగిన పోరు లో ఒక తూటా అర్మిటేజ్ టోపీ దగ్గరగా దూసుకుపోయింది. చావుతప్పి కన్ను లొట్టపోయినట్టవ్వడంతో వెనుదిరిగి, శవాల కోసం స్థానికుల ద్వారా రాజుని సంప్రదించి బ్రతిమలాడుకోవడం తో Rs 500 జరిమానా కట్టి తీసుకెళ్ళేటట్టుగా ఒప్పందం జరిగింది. వారి మృత దేహాలని నర్సీపట్నం తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు జరిపించారు.(ఇప్పటికీ వారి సమాధులు R&B అతిధి గృహం లో ఉన్నాయ్).

యుద్ధం మొదలై నెల రోజులు మాత్రమే అయ్యింది. పరిస్థితుల్లో ఎంతటి మార్పు??
ఏ గిరిజన యువకుడి నైనా సరదాకోసం కాలెత్తి తన్నే పోలీస్ అధికారులు, గొంతెత్తి అరవడానికి గానీ, ఏ స్త్రీ నైనా కన్నెత్తి చూడటానికి గానీ సాహసించడం లేదు. భయం... ఇది రగిలే విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు నడయాడే చోటు. ఒక మన్య స్త్రీకి కీడు చేస్తే రామరాజు కి సంజాయిషీ చెప్పుకోవాలన్న భయం. ఆ సంజాయిషీ కి రూపం చావేనన్న భయం. ఒక భారతీయుడి కి చెడు తలపెడితే తలలు తెగుతాయన్న భయం.
మరి జరినవి సాధారణ యుద్ధాలా? దక్కినవి సామాన్య విజయాలా? నిరాయుధులైన సాధారణ జవాన్లనో, నలుగురైదుగురు పోలీసోళ్లనో, అరాచకాలు చేసిన  బాస్టియన్ నో చంపి "మేం.. గెలిచాం" అనడం కాదు. "విప్లవాగ్ని ఆర్పేస్తా.. తిరుగుబాటుని తొక్కేస్తా" అని భుజాలు చరుచుకు వచ్చిన వాళ్లంతా కొండని ఢీకొన్న పొట్టేళ్ళలాగా భంగపడ్డారు. రాజు ఆశయం తాత్కాలిక పరిష్కారం కాదు. చిన్న, చితకా వాళ్లని కొట్టడం కాదు.తన యుద్ధం ఒక వ్యక్తి మీద కాదు. ఒక వ్యవస్థ మీద. ఒక జాతి మీద. వలసదారుడి పెత్తనం మీద. మీదకి దూకడానికొచ్చిన కుక్క కళ్ళ ఎదురుగా పెద్దపులిని చంపేస్తే,  కుక్క కి మొరిగే ధైర్యం ఉండదు. దాన్ని కొట్టాల్సిన అవసరమూ ఉండదు. ఇక్కడ జరిగిందదే.

ఇది "రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం" అని ఎగిరిపడుతున్న తెల్లవాడి గర్వానికి దెబ్బ.
అత్యాధునిక ఆయుధాలు కలిగిన అతి పెద్ద సైన్యాన్ని ఒక సాధారాణ గిరిజన బృందం కొట్టిన దెబ్బ.
బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్ట కి దెబ్బ.
బ్రిటీష్ సైనిక శక్తి కి సవాల్.

రామరాజునీ అతని సైన్యం యొక్క సామర్ధ్యాన్నీ చూసిన I.G ఆర్మిటేజ్ "ఈ తిరుగుబాటుని ఆపడం కష్టమనీ, సాధారణ పోలీస్ దళాలూ, సైన్యాలూ సరిపోవనీ, అడవుల్లోనూ, కొండల్లోనూ యుద్దం చేసిన అనుభవం ఉన్న సైనికులు అవసరం అనీ" మద్రాస్ సర్కార్ చీఫ్ సెక్రటరీకి టెలిగ్రాం పంపించాడు.

యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయబడ్డాయ్. కొత్త చట్టాలు చేయబడ్డాయ్. కొత్త అధికారులూ, కొత్త టీం లూ, తిరుగుబాటు దార్లని విచారించేందుకు కోర్టులూ ఏర్పాటు చేయబడ్డాయి.ఫితూరీ లో పాల్గొనడమే కాదు, వారికి సహాయం చేయడం, ఆచూకీ ఇవ్వకపోవడం అన్నీ నేరాలే. అనుమానం ఉన్న గిరిజనులందరినీ లారీలలో ఎక్కించి విశాఖపట్నం తీసుకెళ్ళడం పోలీసుల దినచర్య అయ్యింది.
విప్లవకారుల జాబితా తయారయ్యింది. వారికి ఆహారమే కాదు మంచినీరిచ్చినా నేరమే. గ్రామల్లో ఏ ఒక్కరూ ఆయుధాలు కలిగి ఉండకూడదనీ, అన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేతలే అనీ ఆంక్షలు పెట్టింది. పోలీస్ స్టేషన్ల పై దాడులని ఆపడానికీ, ముఖ్యంగా రాజు దళానికి ఆయుధాలు దొరకకుండా ఉండడానికీ చర్యలు తీసుకుంది.

క్రమ క్రమంగా మిలిటరీ సైన్యం విడతలు విడతలు గా వచ్చి చేరుతుంది. పూర్తి సైన్యాన్ని సమీకరించుకునే వరకూ రామరాజు అనే పర్వతాన్ని ఢీకొట్టకూడదని భావించింది ప్రభుత్వం. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంది....

ఆ అవకాశం బ్రిటిష్ సేనకి లభించిందా??
ఎప్పుడు?
ఎక్కడ???
ఎలా????

Thursday, November 8, 2012

ఇది కధ కాదు 3 : రాజు పంజా...!

 రాజు బయలుదేరాడు.. నేపాల్ కి కాదు. గూడెం తాలాకా కి ప్రధాన కేంద్రం అయిన చింతపల్లికి దగ్గర లో ఉన్న పెద్దవలస.ఎవడైతే అధికార గర్వం తో, అమాయక ప్రజల మీద తన రాక్షసత్వాన్ని చూపించి వారికి నరకం చూపిస్తున్నాడో..ఆ తహశీల్దార్ "బాస్టియన్" ఉండే చోటుకి కనుచూపు మేరలోని ఊరది.

ప్రజల దృష్టిలో ఫితూరీ అంటే ఒక దుందుడుకు చర్య. అల్లర్ల తో కొత్త సమస్యలని తెచ్చే అక్కర్లేని గోల.గతం లో జరిగిన తిరుగుబాట్లన్నీ ఆర్ధికం గా, నైతికం గా సామాన్య ప్రజల మీదే ఆధారపడ్డాయ్.అయితే అది ఎప్పుడయితే అదనపు భారమయ్యిందో , ఎప్పుడయితే కొత్త సమస్యలు తీసుకొచ్చిందో అప్పుడే ప్రజలకి ఉద్యమం మీద గౌరవం, నమ్మకం వాటితో పాటూ సహకారం తగ్గాయి.చాలా మంది దృష్టి లో "ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడానికి ఒక అవకాశం" మాత్రమే.

అయితే.. రామరాజు ప్రజలలో ఆ భావనలని పోగొట్టడానికి ప్రయత్నించాడు. గతంలో జరిగిన తప్పులని పునరావృతం కాకుండా ఉండేలా చూశాడు. అప్పికే ప్రిాజ ఉన్నమ్మం, గౌరం, క్తి,  ితూరీ కి మద్దు ఇచ్చేలా చేసింది.గంటందొర, మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, కర్రి కణ్ణిగాడు, పనసల కణ్ణయ్య పడాల్ మొదలగు వారందరూ రామరాజు ప్రధాన అనుచరులుగా పెద్దవలస చేరారు.

తనేం చెయ్యాలనుకుంటున్నాడో చెప్పే ముందు, తనకెలాంటి ఉద్యమకారులు కావాలో, తన సిద్ధాంతాలేమిటో వివరంగా చెప్పాడు శ్రీ రామరాజు.

రామరాజు తన సైన్యానికి ఉద్భోధించిన విషయాలుః

1. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం చేసే ఈ ఉద్యమం లో ప్రతీ ఉద్యమకారుడి పోషణా ప్రజలే చూసుకోవాలి. కానీ అది వారికి భారం కాకూడదు. తాము తిరిగే పల్లె లో ఒకటి - రెండు పూటలకి కావల్సిన భోజన సామాగ్రి మాత్రమే తీసుకోవాలి.

2. క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, దుర్వ్యసనాలకి దూరం గా ఉండటం, స్తీల యెడల మాతృభావన కలిగి ఉండాలి.

3. ఉద్యమం అంటే హింసకి ప్రతి హింస కాదు. ప్రజా సంక్షేమం కోసం పాలక వ్యవస్థ మీద నిరసన. కనుక, గతి లేక తెల్లవాడి కింద పని చేస్తున్న ఏ ఒక్క భారతీయుడూ బలి  కాకూడదు. వాడు పోలీసయినా, వేరే ఏ అధికారి అయినా. 
"మన జోలికొస్తే చంపెయ్యగలం" అని వాళ్లకి తెలియాలి. చావు భయం కలిగించాలి గానీ అనవసర హింస కూడదు.
4. ఈ పోరాటం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదు. అవసరమైనదాని కంటే ఎక్కువ సహాయాన్ని (వస్తు,ధన రూపేణా) అందించడానికి సిద్ధం గా ఉన్నాసరే, దాన్ని నిరాకరించాలి

5. మన్యం లో కత్తులకీ, విల్లమ్ములకీ, నాటు తుపాకీ లకీ కొదవ లేదు కానీ శత్రువు బలమైన వాడు కాబట్టీ తగిన ఆయుధాలు సమకూర్చుకోవాలి.

ఎలా?? ఆయుధాలు ఎలా వస్తాయ్??
రాజు మనసులో ఆలోచన.. "పోలీస్ స్టేషన్ల పై దాడి". ఈ ఆలోచన ఇప్పటిది కాదు అప్పటికి కొన్నేళ్ల క్రితం "తుని" లో చదువుకునేటప్పుడు తన స్నేహితులతో కలిసి చర్చించిన పధకం అది.

అది విన్న క్షణం లో అందరి లోనూ గగుర్పాటు, భయం. పోలీసులు కనిపిస్తే హడలిపోయే ప్రజలు, వాళ్ల బూటు కాళ్లతో తన్నులు తినడానికి అలవాటు పడిపోయిన ప్రజలు. "ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్ల పై దాడి" అన్న ఆలోచనే వారి ఊహకందని విషయం.
కానీ మరుక్షణం తేరుకున్నారు. ఎందుకంటే తమ ముందుండి నడిపించేది....సాక్షాత్తూ తమ స్వామి.
గాం గంటందొర, ఎండు పడాల్, శ్రీ రామరాజుల నాయకత్వం లో మూడు బృందాలు ఏర్పడ్డాయ్. మరునాడు "చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి" కి ముహూర్తం పెట్టాడు రాజు. అందుకు నాందిగా మహారుద్రాభిషేకం చేశాడు రాజు. వ్యూహం సిద్ధమైంది.
************************************************************************

1922, ఆగస్ట్ 22

జవాను తో కలిసి నర్సీపట్నం వెళుతున్న ఈరెన అప్పల్నాయుడు స్వామి ని కలిసి, తాము చింతపల్లి స్టేషన్ మీద దాడి చేయబోతున్న విషయం చెప్పాడు రాజు. అదిరిపడ్డ ఆ అప్పల్నాయుడు ఎదురు చెప్పలేక మెల్లగా జారుకున్నాడు. అతనెవరో కాదు చింతపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్.మధ్యాహ్నం మూడు గంటల సమయం, సుమారు మూడొందల మంది కొండదళం, చేతుల్లో విల్లమ్ములు, కొడవళ్ళు, ఈటెలు, బరిసెలు, నాటు తుపాకులు లతో చుట్టు ముట్టింది కొండమీది పోలీస్ స్టేషన్ ని. కాపలా ఉన్న పోలీస్ లని స్థంభానికి కట్టేశారు. స్టేషన్ లోని కుర్చీ లో కూర్చొన్న రాజు, దొరికిన తుపాకుల్నీ, తూటాలనీ, బాయినెట్లనీ అక్కడికక్కడే సహచరులకి పంచేశాడు.

స్టేషన్ డైరీ లొ ఉత్తరం రాసి సంతకం చేశాడు.

"అల్లూరి శ్రీరామరాజు అను నేను  నా సహచరులతో ఈ పోలీస్ స్టేషన్ ని ముట్టడించి, సెంట్రీని ఆయుధాగారం గది తాళాలు అడిగాను. తాళాలు ఇవ్వడానికి అతను అంగీకరించలేదు. స్థంభానికి కట్టి వేసి తాళాలు తీసుకున్నాను. ఆయుధాలు సేకరించబడినాయి."

-- అల్లూరి శ్రీ రామరాజు [సంతకం]

పోలీసుకు కనిపిస్తే కాళ్ళు తడుపుకునే కొండదళం, వాళ్ల కేంద్రం మీదనే దాడి చేసింది. కొడతానని ముందే చెప్పి, గురి తప్పకుండా  ప్రధాన పోలీస్ కేంద్రాన్ని కొట్టింది. విజయానందం తో బయటకొచ్చారు దళ సభ్యులు. ఆర్తనాదాలకే అలవాటు పడ్డ వారి చేత ఉత్సాహం పెల్లుబికేటట్టుగా, మొదటిసారిగా విజయ నినాదాలు చేయించాడు రామరాజు.

"గాంధీజీ కీ "


"జై...."


"వందేమాతరం"


"మనదే రాజ్యం"


మన్యం గ్రామాలు తిరుగుతూ దారిలో కనిపించిన పోలీసుల దగ్గర ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నారు. పర్యటిస్తున్న ప్రతీ గ్రామం నుండీ ఉత్సాహవంతులైన వీరులు ఉద్యమం లోకి వచ్చి చేరారు.
కృష్ణదేవీ పేట చేరుకుంది కొండదళం. సూచన గా గాల్లోకి కాల్పులు జరిగాయ్.

కొండదళం ఊళ్ళోకి చేరుకునే విషయం ముందే తెలిసిన ఊరి ప్రజలందరూ ఇళ్లకి తాళాలేసుకున్నారు, రాజు కి అత్యంత సన్నిహితుడయిన భాస్కరనాయుడు గారితో సహా. పంచాయితీ పాలన కి ఉపాధ్యక్షుడిగా ఉన్నా గానీ, రామరాజు ఉద్యమం బాట పట్టడం ఆయనకి కలవరం కలిగించింది. తెల్లవారితో విరోధం తన వల్ల కాదని తన నిస్సహాయతని చెప్పేశారు భాస్కర నాయుడు గారు.

ఇందుకు కారణం లేకపోలేదు. ఫితూరీ (ఉద్యమాలు) వారికి కొత్త కాదు. అవన్నీ మరిచిపోవాల్సిన పీడకలలు. గర్రమండ మంగరాజు ఫితూరీ, గొలుగోండ లో శాంతభూపతి, ద్వారబంధాల చంద్రారెడ్డి పితూరీ, రేకపల్లి లో అంబుల రెడ్డి ఫితూరీ.. ఇవన్నీ రామరాజు కంటే ముందు మొదలయ్యి హింసా, రక్తపాతాలతో నిండిపోయి, అణగారిపోయిన, అణగదొక్కబడిన ఉద్యమాలు.

 క్రమశిక్షణ లేని అనుచరులు, శిక్షణ లేని సహచరుల తో కూడిన లక్ష్యం లేని ఉద్యమాలు సామాన్య ప్రజల మీద పడి దోచుకున్నాయి. ఉద్యమం మొదలెట్టిన నాయకులు ఉన్నతాశయాల తో ఉన్నాగానీ, ఈ కారణాల వల్ల బందిపోట్లుగా చిత్రించబడి ఉరికొయ్యలకి వేళ్ళాడారు.

ఇది దొరతనం మీద వ్యతిరేకత తో చేసే స్వాతంత్ర్య పోరాటం తప్ప, అల్ప ప్రయోజనాలకోసం చేసే ఉద్యమం కాదనీ, "ఇది కృష్ణదేవి పేట నమ్మిన శ్రీ రామరాజు మాట" అని ఊరంతా చాటింపు వేయించారు రాజు. తమందరికీ రెండు పూట్లకి సరిపడ భోజన సామగ్రిని మాత్రం ఇవ్వవలసిందిగా కోరారు.

జనం కదిలొచ్చారు. గుమిగూడారు. అంతకు ముందు తెల్లని పంచ అడ్డుకట్ట వేసి, యోగిలా కనిపించే శ్రీ రామరాజు ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్క, మెడలో తూటాల దండ తో(పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నవి), చెప్పులు లేని కాళ్ల తో ఎవరో వాల్చిన మంచం మీద కూర్చొన్నారు.  యుద్ధం లో అలసి, సేద తీరుతున్న సైనికుడి లా కనిపిస్తున్నారాయన. చుట్టూ ప్రధాన అనుచరులు. ఆ వెనక వేరు వేరు విచిత్ర వస్త్ర ధారణలతో, రక రకాల తెగలకి చెందిన కొండ జాతి వీరులు.

పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశిస్తే కాల్చేస్తామని చెప్పారు కృష్ణదేవీ పేట స్టేషన్ సిబ్బంది. అలా అయితే తలపడటానికి సిద్ధంగా ఉండమని బెదిరించి, మనుషుల్ని పంపి ఆయుధాలని స్వాధీన పరుచుకున్నారు రాజు.

ఆ మరుసటి రోజే "రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్" మీద దాడి జరిపింది రామరాజు దళం. అప్పటికే పోలీసులు అప్రమప్తం అవడంతో పోలీసుల కాల్పులు స్వాగతం చెప్పాయ్. 36 రౌండ్ల కాల్పుల తర్వాత, పోలీసులు లొంగిపోవటంతో, ఆయుధాలు స్వాధీనమయ్యాయి. అంతే కాదు గతం లో జరిగిన ద్వారబంధాల చంద్రయ్య ఫితూరీ లో పాల్గిన్నందుకు అరెస్ట్ కాబడీ, విచారణకి నోచుకోకుండా స్టేషన్ లో మగ్గుతున్న మరొక ప్రముఖ మన్యం వీరుడు "మొట్టడం వీరయ్య దొర" ని చెర నుండి విడిపించాడు రాజు.

1922,ఆగస్ట్ 28 న ఆంధ్రపత్రిక లో ఈ దాడిని గురించిన కధనం ప్రచురించబడింది.

{ http://www.pressacademyarchives.ap.nic.in  ఈ లింక్ లో తేదీని, ఆంధ్రపత్రిక ని సెలెక్ట్ చేసుకొని పై కధనాన్ని చూడవచ్చు.లేక ఇక్కడ క్లిక్ చేసి ఆ ఆర్టికల్ ని చదవ వచ్చు.}

1922, august 28 నా రాజమండ్రి నుండి వెలువడే కాంగ్రెస్ పత్రిక లోనూ , 1922 సెప్టేంబరు 2 న మచిలీపట్నం నుంచి కృష్ణపత్రిక లోనూ "ఒక యువ క్షత్రియ నాయకుడు కోయతెగ ప్రజల్లో సహాయ నిరాకరణని వ్యాప్తి చేస్తూ స్వాతంత్ర పోరాటాన్ని చేస్తున్నాడని" కధనాలు వెలువడ్డాయి.ఆ రోజు వరకూ మన్యం గ్రామాల్లో మాత్రమే సుపరిచితమైన "అల్లూరి శ్రీ రామరాజు" పేరు మన్యాన్ని దాటి బయటకి వచ్చింది.
రామరాజు ఎవరో, అతని సామర్ధ్యం ఏంటో, మైదాన ప్రాంతం లోని సాధారణ ప్రజలకి తెలిసింది. దొరతనానికి చెంప చరిచిన అనుభవమయ్యింది.

నర్సీపట్నం దగ్గర తిరుగు బాటు జరిగిందనీ, ఆయుధాలని దోచుకున్నారనీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదనీ, గతం లో కొంతకాలం ఇంటరన్ అయ్యి, నేపాల్ యాత్రకి అనుమతి పొందిన రామరాజు దీనికి నాయకుడనీ, కారణాలు తెలియలేదనీ మద్రాస్ లోని ప్రభుత్వ కార్యదర్శి R.A గ్రాహం కు టెలిగ్రాం వెళ్ళింది. తిరుగుబాటు అణచడానికి స్పెషల్ ఆఫీసర్ల నేతృత్వం లో ,అధిక సంఖ్యలో పోలీస్ దళాలని మన్యం వైపు పంపించడానికి ఏర్పాట్లు జరిగాయి...!

మరి.... ఆ అదనపు పోలీస్ దళాలని రాజదండు తట్టుకోగలిగిందా??