Thursday, November 29, 2012

ఇది కధకాదు 8 : బీటలు వారిన ఉద్యమం

1923 డిసెంబర్.
కాకినాడ లో  జాతీయ  కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయ్. మౌలానా మహమ్మదాలీ ఆ సభలకి అధ్యక్షుడు కాగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా వెంకటప్పయ్య గారు ఆహ్వాన సంఘం అధ్యక్షులు. చిత్తరంజన్ దాస్, వల్లభాయ్ పటేల్ మొదలైన ప్రముఖులు సమావేశాలకి వచ్చారు. నాయకుల, ప్రతినిధుల సందేశాలు చదువుతుండగా ఒక సిక్కు వాలంటీరు ఒక చీటీని వేదిక మీదకి పంపి దానిని తన సందేశంగా చదివి వినిపించమని కోరాడు. అధ్యక్షులు మహమ్మదాలీ తిరస్కరించాడు. ఆ సిక్కు వాలంటీరు వత్తిడి చేసేసరికి వేదిక మీద ఉన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి ఇచ్చేసారు ఆ చీటీని. ఆ చీటీలో విషయం ఏంటంటే...
"తాను సాయుధ సమరం చేస్తున్నాననీ, వీలైతే కార్యకర్తలను పంపడం, కాస్త ధన సహాయం చెయ్యడం తప్ప, తన దారికి అడ్డురావద్దని".
అసలు విషయం ఏంటంటే.. ఆ గెడ్డం సిక్కు వాలంటీరు ఎవరోకాదు మారు వేషం లో వచ్చిన రామరాజు . తను కనిపిస్తే చాలు.. ఉన్న పళంగా ఉరికొయ్యకి వేలాడదియ్యడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి తెలిసీ కాకినాడ రావడం ఒక సాహసం అయితే తన పేరున సందేశం వినిపించాలని కోరడం మరొకటి.

*******************************************************************************
1924 జనవరి 27
 700 మందికి పైగా పోలీసులు, 30 మంది ఆఫీసర్లు సంవత్సరం ఆరు నెలల పాటు తిరుగుతానే ఉన్నారు. రోజు కూలీ ఆరు అణాలు ఉన్న టైం లో 13 లక్షల రూపాయల ఖర్చు.

పూర్తి స్థాయి సైనిక చర్య కి ముందుగా ఆఖరి ప్రయత్నంగా  ప్రభుత్వం భావించిన అస్సాం రైఫిల్స్ దళం ( 400 మంది )  నర్సీపట్నం రైల్వేస్టేషన్ లో దిగి కోట ఉరట్ల మీదుగా మన్యం చేరింది. రామరాజు వెంట వంద మంది ఉన్న ఆ సమయానికి, మన్యం లో సైనిక బలగాల సంఖ్య 1000 కి చేరింది. మేజర్ గుడాల్ తన దళాన్ని బృందాలు గా విడదీసి గాలింపు ప్రారంభించాడు. పోలీస్ పదఘట్టనలతో అడవి గ్రామాలన్నీ కంపించిపోతున్నాయ్.
1924 నాటికి 1200 మంది పోలీసులు,  అస్సాం రైఫిల్స్ దళం,  16 మంది ఉన్నతాధికారులు, 450 మంది ఇతర స్థాయిఅధికారులు తిరుగుతున్నారు. మోత కోసం 106 గాడిదలు, 12 ట్రక్కులు ఉన్నాయి
మరో వైపు రామరాజు సేన కూడా 3 బృందాలుగా తన కార్యకలాపాలని సాగిస్తుంది. ఉద్యమ కారుల కుటుంబ సభ్యులు ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో, ఎక్కడ భోజన సామాగ్రి, బట్టలు ఇవ్వాలో అక్కడ ప్లాన్ చేసిన ప్రకారం ఎవ్వరికీ అనుమానం రాకుండా జరిగిపోతున్నాయ్. అయితే రాజు ప్రధాన అనుచరుల్లో ఒకడయిన వీరయ్య దొర భార్య ఇలాంటి ప్రయత్నం లోనే అస్సాం రైఫిల్స్ కి దొరికిపోయింది. అతని కుటుంబం మొత్తం రాజు వెనకే తిరిగేది. ఆమె నుండి పోలీసులు రాబట్టిన సమాచారం తో "సుద్ధగంట" కొండలలో దాచిన కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి.
***************************************************************************
1924 ఏప్రియల్
మించాలపాడు సత్యాగ్రహం లో కన్నెగంటి హనుమంతు ని తుదముట్టించి, ఉద్యమాన్ని దిగ్విజయం గా అణచివేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ "టి.జి. రూధర్ ఫర్డ్" ఏజన్సీ లో స్పెషల్ కమిషనర్ గా నియమింప బడ్డాడు. చినుకు పడే లోపు ఉద్యమాన్ని రూపు మాపేయాలని రూధర్ ఫర్డ్, గుడాల్ లు నిర్ణయించారు. రామరాజు ని పట్టి ఇస్తే ఇచ్చే బహుమతి ని Rs. 1500 నుండి Rs. 10,000 కి పెంచడమే కాక  మరో ఏడుగురిని క్షమించరాని నేరస్థులు గా ప్రకటించాడు. ఉద్యమ క్షేత్రమైన మన్యాన్ని బెదిరించడానికి, తన లక్ష్యం సాధించడానికి తనకి తెలిసిన అన్ని విద్యలూ, వికృతులూ ప్రదర్శించడం మొదలు పెట్టాడు రూధర్ ఫర్డ్. పల్లె పల్లెనీ వేధించే పని మొదలైంది. రాజు ని పట్టించాల్సిన బాధ్యత ప్రజలదే అనీ, అలా కాని పక్షం లో మన్యం మొత్తాన్నీ తగలబెట్టేస్తాననీ, ప్రతీ ఊరికీ కిరోసిన్ పీపాలు దింపుతాననీ ప్రకటించాడు. అనడమే కాదు చినమల్లం పేట, కంఠారం మొదలైన గ్రామాలు మొదలుకొని ఊళ్లకి ఊళ్ళు తగలబెట్టి తనేంటో ప్రజలకి చెప్పాడు. రాజు కి ఎంతో ఇష్టమయిన "ధారమఠం" మీద దాడితో పాటూ విధ్వంసం జరిగింది. ఉద్యమానికి మద్దతు ఇస్తున్న మున్సబులు, ప్రజలు వేరే విచారణ లేకుండా జైలుకి పంపబడ్డారు.  ఉద్యమం మొదలు కావడానికి ఎటువంటి పరిస్థితులు దారి తీశాయో, అంతకంటే భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మగవారికి చిత్రహింసలూ జరుగుతున్నాయ్.   ఇవన్నీ రామరాజు కోసం వేసే వలలు అనుకోవచ్చు, రాజు ని దెబ్బకొట్టడానికి పోలీస్ పధకాలు కావచ్చు. కావాలి...రామరాజు ప్రాణాలతోకావాలి. తమ చేతికి రాజు చిక్కేవరకూ ఇవే పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరికలు పంపాడు రూధర్ ఫర్డ్. కారణం ఏదయినా మన్యం ప్రజల పరిస్థితి పెణం మీద నుండి పొయ్యి లో పడ్డట్టు అయ్యింది. ఒక వైపు పంటలు లేవు. మరో వైపు పోలీస్ ల దారుణాలు. వీటి తో ఉద్యమానికి సహాయం చేసే వారు కాదు కదా కనీసం భోజనం పెట్టేవారు కూడా కరువయ్యారు. అంతే కాక కొంతమంది విప్లవకారులని పట్టించడం మొదలు పెట్టారు. దీనితో ఉద్యమకారులలో అసంతృప్తి భగ్గుమంది. పట్టించిన  వారిని తీవ్రంగా దండించడం మొదలు పెట్టారు.
మే నెలలో రాజు ప్రధాన అనుచరుడు వీరయ్య దొర  పోలీసులకి పట్టుబడ్డాడు.

ఇలాంటి పరిస్థితులలో పైడిపనుకుల గ్రామం లో సమావేశమైంది కొండదళం. తెల్లదొరలు గుడారాలు దాటి రారు. నల్ల పోలీసులని చంపకూడదని నియమం. కానీ అలాంటి నియమం వాళ్లకి లేదు. శత్రువు రక్త పిపాసి. "మరి ఉద్యమం ఎలా నడుస్తుంది??" అన్న ప్రశ్న సూటిగా తాకింది రామరాజు ని. "భారతీయులని చంపకూడదు" అన్న విచక్షణ కి స్వస్తి పలకాలని గట్టిగా అభిప్రాయ పడ్డారు కొందరు. చేతిలో తుపాకి ఉండీ ఊరుకోవడం వల్ల ప్రజల్లో నమ్మకం పోతుందని, బ్రిటిష్ సేన రెచ్చిపోతుందనీ వాదించారు. అయినా తన పంధా మార్చుకోనని తెగేసి చెప్పాడు రాజు. మారాల్సిందేనని పట్టుబట్టింది ఒక బృందం. "అయితే నన్నే పట్టివ్వండి" అన్నాడు రాజు. దళం లో చీలిక వచ్చింది. ఆ బృందం రాజు దగ్గర సెలవు తీసుకుంది.
******************************************************************************

1924 మే 5
శ్రీ రామరాజు, గంటందొర, అగ్గిరాజు కొండపల్లి వచ్చారని తెలిసి ఇంటెలిజన్స్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పట్నాయక్ తన బలగం తో వెళ్ళాడు. రాజు ఆచూకీ కోసం గ్రామాన్ని ధ్వంసం చెయ్యడం మొదలెట్టాడు. అప్పటికే రామరాజు వెళ్ళిపోయాడని తెలియడంతో వేట మొదలైంది. కొంత దూరం వెళ్ళేసరికి కనిపించడం తో ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి. అగ్గిదొర పోలీసులకి దొరికి పోగా ఎర్రేసు, గంటందొర, ఎండుపడాలు మొదలగువారు తప్పించుకున్నారు. అయితే ఆ మర్నాడు మధ్యాహ్నం మూడుగంటల సమయం లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. కొందరు చనిపోయారు. కొందరు దొరికి పోయారు. ఒకే ఒక్కడు ఒంటరి గా మిగిలిపోయాడు. ఆ ఒక్కడూ... రామరాజు. చీకటి పడింది. ఆ చీకట్లోనే కొత్తరేవళ్ల మీదుగా మంప  గ్రామానికి చేరుకున్నాడు. ఎదురుగా జొన్న చేను. చేను మధ్యలో మంచె. ఎక్కి పడుకున్నాడు.
రాజు మనసులో ఆలోచనలు కుదిపేస్తున్నాయి.
అవును.. మన్యం లోని అశాంతిని  పారద్రోలి, స్వేచ్చని ప్రజలకిద్దామనుకున్నాడు. అందుకే పోరు మొదలెట్టాడు. పోరాడాడు. సాధారణ జనానికి ధైర్యం నూరిపోసి తిరుగుబాటు చేయించాడు. కానీ చివరకి ఏమయ్యింది? పరిస్థితులు "కొరడా దెబ్బల మీద కారం" నుండి "కొడవళ్ల తో వాతలు" వరకూ వచ్చాయి.  మర్రివాడ లోని "ఎలచూరు ఎల్లమ్మ" అనే గిరిజన మహిళ. తను ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా  ఆత్మీయత తో పాలు పంపించేది. రామరాజు పై చూపించిన ఆ అభిమానమే రాజద్రోహమయ్యింది. రాజు ఆచూకీ చెప్పమని ఎర్రగా కాల్చిన కొడవలి ఆమె వీపు కి అంటినప్పుడు ఆమె చేసిన ఆర్తనాదానిది ఏ భాష??
ఒక ఉద్యమకారుడి పేరు, తన పేరు ఒక్కటే అయిన పాపానికి ఒక అమాయక యువకుడి ని పీకలవరకూ గొయ్యి తీసి పాతి, తాటాకు నిప్పంటించి తల మీద పెట్టి సజీవ దహనం చేసినప్పుడు ఆ అమాయకుడు చేసిన రోదన తనని పట్టి చిత్రవధ చెయ్యటం  లేదూ?? నేరం ఎవరిదీ? పరాయి వాడి పాలన కింద బతుకీడ్చాల్సి వచ్చిన పరిస్తితులదా? ఉద్యమం లేవనెత్తిన తనదా? విచక్షణ మరిచిన శత్రువుదా?
తన సంస్కరణ వాదం, సిద్ధాంతాలూ, నియమాలూ ఏం మార్పు తీసుకురాగలిగాయి??
తాగి తన అనుచరుడు పట్టుబడిపోయిన  సంఘటన తన ఆశయాన్ని అవహేళన చెయ్యటం లేదూ?
ఏ ప్రజలని రక్షిద్దామని పోరు మొదలెట్టాడో, అదే ప్రజలని  ఉద్యమాన్ని నిలబెట్టుకోడానికి తన మనుషులే హింసిస్తున్నప్పుడు, అది తను సహించాల్సి వచ్చినప్పుడూ, ఉద్యమకారుల పేరుతో కొందరు ప్రజలని దోచుకుంటున్నప్పుడూ, తను ఆపలేనప్పుడూ మన్యం ప్రజలని తన కారణం గా చిత్ర హింసల పాలుచేస్తుంటే తను ఇలా ప్రాణాలు దక్కించుకోడానికి తప్పించుకు తిరుగుతున్నప్పుడూ ఈ పోరాటం ఎందుకు? ఎవరికోసం??

ఉద్యమం  లో శత్రువుకీ విచక్షణ ఉంటుందని, వుండాలని ఆశించడం పొరపాటు. కానీ ఉద్యమకారుడు కూడా విజ్ఞతని విడిచిపెట్టడానికి సిద్ధపడితే అది గ్రహపాటు.
 ఇక మిగిలేవి లక్ష్యాలు కావు.... కక్ష్యలు.
 జరిగేది పునర్నిర్మాణం కాదు... విద్వంసం.
దీనికి అవతల్నుండి జవాబు... మళ్ళీ విధ్వంసం... రక్తపాతం...!
దీన్ని కొనసాగించడానికి ఇందరు అమాయకులని బాధించాలా??


1924 మే 7 ఉదయం 7.30  తరువాత....
రాజు నిద్ర లేచి, ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించిన రాజన్న పడాలు ఇంటికి దగ్గర లోని కుండం లో స్నానం ముగించాడు. చుట్టూ చింతల తోపులు. సరిగ్గా అప్పుడే... ఆ చింతల తోపుల నుండి కొంత సాయుధ సైన్యం రాజుని చుట్టి ముట్టింది.  ఆ ప్రాంతం లో నిఘా నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ సబ్ ఇన్స్పెక్టర్ "ఆళ్వార్ నాయుడు" రాజుని పట్టుకున్నాడు. అతి సంక్లిష్టమయిన సమస్యలకి చాలా సులభమైన సొల్యూషన్ దొరుకుతుందన్నట్టూ, సంవత్సరం పది నెలలపాటు బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన అల్లూరి శ్రీ రామరాజు పోలీసుల చేతికి చిక్కాడు.

ఈ సారి ఏ అద్బుతాలూ జరగలేదు..
మలుపులు లేని ముగింపు.... వచ్చే భాగం లో.....!!

4 comments:

Sravya V said...

చాల బాగా రాసారు రాజ్ ! Waiting for next part !

Anonymous said...

చాల బాగా రాసారు రాజ్ ! Waiting for next part !

రాజ్ కుమార్ said...

శ్రావ్య గారూ, అనానిమస్ గారూ..
ధన్యవాదాలు ;) ;)

Anonymous said...

Found your blog recently. Wow, you are very talented!! Would love to see you posting more often.