Thursday, November 15, 2012

ఇది కధ కాదు 5 : ఫిరంగి దెబ్బ

రాజుదళం సాగుతుంది. విజయ పరంపర తో... గర్వంగా...!
అప్పటి వరకూ చేసిన దాడులన్నీ దొంగచాటుగా కాదు. "ఈ రోజు మీ పై దాడికి వస్తున్నాం" అని ముందే చెప్పి, పెట్టిన ముహూర్తానికి బయలుదేరి చెప్పిన చోటుని కొట్టినవే. అయితే ఈ సారి పోలీస్ యంత్రాంగం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న మాట వాస్తవం.

1922 అక్టోబరు 15
బ్రిటిష్ పోలీస్ అధికారగణాలు మోహరించిన ముఖ్య కేంద్రాలలో ఒకటి  "అడ్డతీగల" పోలీస్ స్టేషన్.
 డెబ్బై మైళ్ల దూరం అడవి లో ప్రయాణం చేయాలి అక్కడకి చేరాలంటే."అడ్డతీగల" పోలీస్ స్టేషన్ ని కొట్టబోతున్నాననీ, చేతనయితే ఆపుకోమనీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బ్రేకన్ కీ,  ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారి "సదావర్తి ఆదినారాయణ" కీ ముందే సమాచారం అందించాడు రాజు. రాజు దండు ని ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే స్టేషన్ లోని ఆయుధాలన్నీ ముందే దాచేశారు. స్టేషన్ ఖాళీ చేసేసి పోలీసులంతా పారిపోవటం తో రాజు బృందానిది వృధా ప్రయాస అయింది. ఆ రోజు రాత్రి తొంబై మంది సభ్యులతో రాజు స్టేషన్ లో బస చేసినప్పుడు గానీ, మర్నాడు వాగులో స్నానం చేస్తున్నప్పుడు గానీ రాజు యొక్క ప్రతీ కదలికా పోలీసులకి తెలుస్తూనే ఉంది.తను ఎన్ని గంటల వరకూ అడ్డతీగల లో ఉంటాడో కూడా రామరాజు ముందే చెప్పాడు. కానీ రాజుని ఎదుర్కొనేంత ధైర్యం గానీ, రాజుదళం తో పోరాడే తెగువ గానీ తెల్లదళం లోని ఏ పోలీసు కీ లేదు. అంతకు ముందు జరిగిన ఫితూరీ లలో ఆ పోలీస్ స్టేషన్ మూడు సార్లు ధగ్దమయ్యింది. ఒక్క అగ్గిపుల్ల గీసి తగలెట్టెయ్యడం చిటికె లో పని. కానీ ఉద్యమం లో విధ్వంసం ఒక సంస్కృతిగా పెరిగి పెద్దది కావడం రాజు ఉద్దేశ్యంకాదు. రాజు ఉద్దేశ్యమే రాజుదళానికి ఆజ్ఞ. ఆసుపత్రి నుండి అవసరమైన మందులు మాత్రం తీసుకొని చోడవరం ప్రయాణమయ్యాడు.

1922 అక్టోబరు 19
మాట్లాడే పని ఉందని రాజు స్వయంగా పిలిచినా గానీ ధైర్యం చేయని కలెక్టర్ బ్రేకన్, తహశీల్దార్ అప్పలనర్సయ్య పంతులు ని, చోడవరం చేరిన రాజుతో మంతనాల కోసం పంపించాడు. అప్పలనర్సయ్య కి రాజుతో గతం లోనే పరిచయం ఉండటం తో ఈ ఉద్యమం ఉద్దేశ్యమేమిటి? స్వాతంత్ర్యం మీ ఒక్కరి వల్లా సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించాడు.
"వ్యాపారం కోసం వచ్చిన వలసదారులు, మనలో ఐక్యత లోపించిన విషయాన్ని పసిగట్టి, లోకువగట్టి, ఆర్ధికంగా, రాజకీయం గా, శక్తిని కూడగట్టుకొని అధికార బలంతో భారత జాతి మీద సవారీ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మార్గాలలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంది. అందులో అతివాద ధృక్పదం తోనే నేను ఉన్నాను. మన్యం పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ శాంతియుత పోరాటం పనికిరాదు. రక్తపాతం తప్పదు. ఇది ఆరభం మాత్రమే. అసలు పోరాటం మొదలైనప్పుడు నేను లేకపోయినా నా అనుచరులు ఉద్యమాన్ని నడిపిస్తారు" అని సమాధానం చెప్పాడు రాజు. భారతీయుల సహాకారం వల్లే తెల్లవాళ్ళు ప్రాణాలతో బతికున్నారనీ, పరిపాలిస్తున్నారనీ తేల్చి చెప్పాడు. తాను పట్టుకొచ్చిన అరటి పళ్లని రాజు కి సమర్పించి, నమస్కరించి వెళ్ళిపోయిన తహశీల్దార్, చర్చా నివేదిక ని కలెక్టర్ కి పంపించాడు.
 అదే రోజు చోడవరం స్టేషన్ పై దాడి చేశాడు రాజు. సిబ్బంది మొత్తం అతనికి సాష్టాంగ పడిపోయారు. అయితే ఎటువంటి ఆయుధాలూ దొరకక పోవటం తో స్టేషన్ సిబ్బంది తో మాట్లాడి, సాయంకాలం వెళ్ళిపోయాడు. సమీపంలోకి వచ్చినా రాజుని అరెస్ట్ చేయనందుకు పోలీసుల మీద దర్యాప్తు మొదలైంది.

నాలుగు రోజుల తర్వాత....
రామవరం లో సాండర్స్ నాయకత్వం లోని సేన రాజుదళం తో తలపడింది. ఫలితం అప్పటికి వరకూ తెల్లసైన్యానికి అలవాటు అయినదే. "దొరికిపోవటం, చచ్చిపోవటం, చావు తప్పించుకు పారిపోవటం." బ్రిటిష్ సేన లోని కెప్టెన్ స్టువర్ట్ మాటల్లో చెప్పాలి అంటే " రాజు వ్యూహాలు ఊహలకి అందవు. తను ఎక్కడ ఉన్నాడో ముందే సమాచారం పంపుతాడు. పోలీసులు పట్టుకోడానికి బయలు దేరుతారు. అయితే అదంతా గొప్ప పధకం. పోలీసులు వెళ్లేసరికి అక్కడ ఎదుర్కోడానికి సిధ్ధంగా కాపుకాసి ఉంటాడు. పోలీసులు అతని వల లో ఇరుక్కుపోతారు".
ఇదే అక్టోబరు నెలలో ఏజన్సీ లలో ఎక్కువగా వచ్చే విషజ్వరాలు విలయతాండవం చెయ్యడంతో కొన్నాళ్ళు ఇరుపకక్షాలూ పోరాటం ఆపవలసిన పరిస్థితి వచ్చింది. పెంచిన పోలీసు దళం కోసం ఆస్పత్రులు, వాహనాలు, ఇతర పరికరాలు ఏర్పాటు చెయ్యవలసి వచ్చింది.
************************************************************************

1922 నవంబరు
రామరాజు ఆచూకీ కోసం గాలిస్తున్న నిత్యానంద పట్నాయక్ అనే పోలీస్ అధికారి రాజు దళానికి దొరికాడు. ఏయే ఊళ్ళలో ఎంత పోలీసు బలగం ఉందో అతని ద్వారా తెలుసుకొన్నాడు రాజు. "తమ ఆచూకీ కోసం గ్రామ పెద్దలని బెదిరించినా, ప్రజలని వేధించినట్లు తెలిసినా, అది ఎవడయినా సరే.. ప్రాణాలు తీస్తా..! " నని హెచ్చరించి వదిలేశాడు. పట్నాయక్ మాటల ప్రకారం శ్రీ రామరాజు అప్పుడు తన కొలువు లో ఎలా ఉన్నాడంటే...
"రాజు ఖాకీ నిక్కరు, చొక్కా వేసుకొని మంచం మీద కూర్చొని ఉన్నాడు. పక్కనే 303 తుపాకీ ఉంది. మరో పక్క మంచం మీద 303 రైఫిల్స్, బాణాలు ఉన్నాయి. చుట్టూ ఎనభై మంది దాకా ఉద్యమకారులు ఉన్నారు"
***************************************************************************

అనుమానమున్న గ్రామప్రజలని విచారిస్తున్నా, రాజు ఉద్యమానికి మద్దతిచ్చిన గ్రామాలపై అధిక సుంకాలని విధిస్తున్నా, బెదిరిస్తున్నా గానీ ప్రజలంతా రాజు కి సహాయం చెయ్యడం, పోలీసులు రాజుకి భయపడటం ప్రభుత్వాకి తలనొప్పిగా తయారయ్యింది.

నవంబరు నెలాఖరు నాటికి స్పెషల్ పోలీస్ దళాలు వేల సంఖ్యలో పెరిగాయి. యుధ్ధాలలో వాడే లూయీ ఫిరంగులు వచ్చి చేరాయి. సమాచారం కోసం వైర్ లెస్ సెట్లు దించారు. టెలీఫోన్ లైన్స్ వేశారు{అయితే టెలీఫోన్ వ్యవస్థని రాజుదండు నాశనం చేసింది.}. చిన్నా చితకా స్టేషన్లలో కూడా ఆయుధాలు, డబ్బు ఉంచకుండా ఏర్పాట్లు చేశారు. అందువల్ల పోలీస్ స్టేషన్ల పై రాజు చేస్తున్న దాడులన్నీ వృధా అయ్యాయి.
అంటే గత కొన్ని నెలలుగా కళ్ల ఎదుట కనిపించి సవాలు చేస్తున్నా రాజు ని అరెస్ట్ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న తెల్లవాళ్లకి అతన్ని  ఎదుర్కోడానికి అనుకూల పరిస్థితులు వచ్చాయి.
కానీ 1922 డిసెంబరు నెలనాటికి రాజు ఆరోగ్యం పాడయ్యిందనీ, దళం లో చీలికలు వచ్చి కొందరు ఉద్యమకారులు బయటకి వచ్చేశారనీ వదంతులొచ్చాయి.

అదే డిసెంబరు లో జరిగిందో సంఘటన. వరుస విజయాలతో తెల్లోళ్ల గుండెల్లో గుబులు పుట్టించి పరుగులు పెట్టిస్తున్న రాజుసేన కి ఒక చేదు అనుభవం. రామరాజు పౌరుషాన్నీ, ప్రతాపాన్నీ, పోరాటపటిమనీ చూసి మురిసి పోతున్న మన్యం ప్రజల్లో మళ్ళీ భయాందోళనల బీజం నాటిన ఘటన.

1922 డిసెంబర్ 6
రామరాజు దళం ఆచూకీ కోసం తమ బెటాలియన్ తో వెతుకుతున్న జాన్, చార్స్లీ  అనే అధికార్లకి రాజు దళం లోని ఇద్దరు సభ్యులు చిక్కారు. పోలీసు చిత్ర హింసల తో రాజు "పెదగడ్డ పాలెం" లో ఉన్నాడన్న సంగతి వారినుండి రాబట్టారు. బెటాలియన్ పెద్దగడ్డపాలెం వైపు ఫిరంగులతో దారి తీసింది. రాజు సేన తమ స్థావరం నుండి బయటకొచ్చి వరిపొలాలు, నిలువెత్తు జొన్న చేను, చింత తోపుల చాటు నుండి యుద్ధం చెయ్యడం మొదలెట్టింది.  కానీ ఫిరంగులకి ఎదురు నిలిచి తుపాకుల తో యుద్ధం చెయ్యడం కష్టమవ్వడం తో రాజుసేన ప్రాణరక్షణ కోసం పారిపోవాల్సి వచ్చింది. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది ఉద్యమకారులు మరణించారు. మందుగుండు సామాను, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పారిపోయిన వారి కోసం స్వెయిన్ నేతృత్వం లో వేట మొదలైంది. రాజు స్థావరం లింగాపురం లో ఉన్నదన్న సమాచారం రాబట్టింది తెల్లదళం. పగలంతా తిండి లేకుండా యుద్ధం చేసి, అలసి, నీరసించి పోయిన రాజు సేన లింగాపురం లోని తమ స్థావరం లో విశ్రాంతి తీసుకుంటున్నారు. చీకటి పడింది. ముందే చెప్పి దాడి చెయ్యడం రాజు నైజమేమో గానీ తెల్లసైన్యానికి అటువంటి నీతులేమీ లేవు.  పహారా కాస్తున్న వాళ్ళని మట్టుబెట్టి, స్థావరాన్ని మూడువైపుల నుండి చుట్టు ముట్టింది పోలీస్ దళం. ఆ రాత్రి... ఆ చీకట్లో అప్రతిహతంగా జరుగుతున్నాయి కాల్పులు. పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు ఉద్యమకారులు. బ్రిటిష్ సైన్యం ఆ రోజు ఎంత పైచేయి సాధించిందంటే రాజు పరుపు మొత్తం చిల్లులు పడిపోయింది తూటాల దెబ్బకి. తెల్లారేసరికి మరో ఎనిమిది మంది కొండదళ సభ్యులు మరణించారు. అయితే... ఎలా సాధ్యమయ్యిందో తెలీదు... మిగిలిన అనుచరులతో రాజు తప్పించుకున్నాడు.
 ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే రామరాజు తన పక్క మీద కాక వేరొక చోట నిద్రపోయేవాడు. యుద్ధ తంత్రాలలో అదొక భాగం.

చనిపోయిన ఉద్యమకారుల శవాలని ఊరేగిస్తూ.. "ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తే.. ఎవ్వడికయినా ఇదే గతి"
అని బెదిరించి, తమ మొదటి విజయం తో బలంగా చాటి చెప్పింది తెల్లదళం.

"శ్రీ రామరాజు ని పట్టి ఇచ్చిన వారికి Rs.1500, దళ సభ్యులని గానీ తుపాకీలని గానీ పట్టి ఇచ్చిన వారికి Rs.50 బహుమతి. ప్రజలంతా ప్రభుత్వాదేశాలని శిరసావహించాలి. "కాదూ..కూడదూ" అంటే రాజు దళం నాశనమయ్యేంత వరకూ స్పెషల్ పోలీసు బలగాలు గ్రామాల లోనే ఉంటాయ్. వారి ఖర్చంతా ప్రజలే భరించాలి" . ఈ ఆదేశాన్ని ప్రతీ గ్రామానికీ జారీ చేసింది ప్రభుత్వం.

ప్రభుత్వానికి సమాచారం అదించటం లేదన్న నెపంతో చాలామంది మున్సబులపై కేసులు నమోదయ్యాయి. అయితే తలలకి వెల అనే పథకం కొంతవరకూ పని చేసింది. ఎంతయినా డబ్బు పాపిష్టిది కదా..! కొందరు మున్సబులు దళ సభ్యులని పట్టించే పనికి శ్రీకారం చుట్టి, ఉద్యమానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మిగిలిన సాధారణ ప్రజానీకం నిశ్శబ్దం గా ఉంది..!
పోలీసులకి ధైర్యమొచ్చింది. రాజు , అతని ప్రధాన అనుచరులు, మరికొంతమంది తప్ప తక్కిన వారు మరణించడం, దొరికిపోవటం జరిగిందని పోలీసులు భావించారు. లభించిన ఘన విజయానికి వేడుకలు జరుపుకున్నారు. ఎక్స్ట్రా ఫోర్స్ నీ, పరికరాలనీ వెనక్కి పంపించెయ్యొచ్చనే ఆలోచనలో ఉంది తెల్లసేన..!

రాజు ఏమయిపోయాడో...ఎక్కడ ఉన్నాడో... తెలీదు.
ఉద్యమం చితికి పోయినట్టేనా??
అంతేనా ఇక???

పోరాటం ఆగిందా?? కొనసాగిందా??

6 comments:

పల్లా కొండల రావు said...


waiting for....పోరాటం ఆగిందా?? కొనసాగిందా??

Sravya V said...

హ్మ్ ! అయితే దాడులు చేసే వారికి ఆయుధాలు దొరక్కుండా ఖాళీ చేసే ఆలోచన ముందు నుంచి ఉన్నదేనా ? interesting ! తరవాత ఏమవుతుందో ?

రాజ్ కుమార్ said...

కొండలరావు గారూ... నెక్స్ట్ పార్ట్ కి టైటిల్ ఏం పెట్టాలా? అని ఆలోచిస్తున్నా... మీ ఐడియా ని పరిగణన లోకి తీసుకుంటున్నానండీ
ధన్యవాదాలు ;౦

శ్రావ్యగారూ.. ముందు నుండీ ఉండటం?? నాకు అర్ధం కాలేదు మీ డౌట్.. ;)
తర్వాత ఏమ్ జరిగిందో తొందరలోనే రాయడానికి ట్రై చేస్తాను. థాంక్యూ సో మచ్ ;)

Raviteja said...

కథ మంచి సస్పెన్స్ ఉంది అనగా ఆపివేస్తే ఎలా కొనసాగించండి అంతే..... :)

జయ said...

అరటిపండు వలిచి మరీ చేతుల్లో పెట్టినట్లే ఉంది రాజ్ కుమార్. చాలా మంచి పరిశోధన. వచ్చే ఎపిసోడ్ లో నా అనుమానాలు తీరిపోతాయనిపిస్తోంది. తీరకపోతే అడిగేస్తా.

వేణూశ్రీకాంత్ said...

చాలాబాగా రాస్తున్నావ్ రాజ్.. వెయిటింగ్..