Monday, November 26, 2012

ఇది కధ కాదు 7 : ఆగని సమరం..!

క దేశం తో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలందరినీ శత్రువులు గా భావించాలా??
మన శత్రువు యొక్క అనుచరులంతా వేరే ఏ కారణం లేకుండా మన శత్రువులేనా??
ఆ శత్రువు పరిపాలనా వ్యవస్థే అయితే అందులో భాగమైన వారందరిపై యుద్ధం చెయ్యాల్సిందేనా??
మన అయిష్టాన్నీ, ద్వేషాన్నీ చూపించాల్సిందేనా??

వీటికి సమాధానం అవును అయినా కాదు అయినా రామరాజు మాత్రం పోరాటం పేరుతో అనవసర హింస కి ఎప్పుడూ పాల్పడలేదు తను హింసా పద్ధతిలో నడుస్తున్నా సరే. 1923 ఆగస్ట్ 4 న జరిగిన ఒక చిన్న సంఘటన దీనికి మరో ఉదాహరణ.
 పెదవలస సమీపం లోని రంపులఘాటీ లో ఇద్దరు పోలీసులని రాజు దళం పట్టుకుంది. శత్రువు కి కూడా మర్యాద ఇవ్వడం రామరాజు గుణం.  ఆ ఇద్దరు పోలీసుల నుండీ కొన్ని రొట్టెలని సేకరించాడు. పెద్దవలస పోలీస్ శిబిరం నాయకుడైన పీటర్సన్ కి ఒక పోస్టల్ రశీదు వెనక ఉత్తరం రాసిచ్చాడు.

ప్రియమైన పీటర్ సన్!
                               నా సహచరుడు అగ్గిరాజు జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రొట్టెలు అతని కొరకు మీ వారి నుండి తీసుకున్నాను. అందుకు మీకు ఒక బుట్ట పండ్లు పంపుతున్నాను. నన్ను గురించి చెడుగా భావించరని తలుస్తాను. 

సం॥ శ్రీ రామరాజు.

ఇదే ఆగస్ట్ నెలలో ఒకరోజు ఉదయం, రాజుదళాన్ని కోరాపుట్ రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్ చుట్టుముట్టి కాల్పులు జరిపింది. కానీ రాజు తప్పించుకున్నాడు. ఒకప్పటి లాగా ముందే సమాచారం ఇచ్చి దాడి చేసేందుకు గానీ, పట్టపగలే పోలీసుల ఎదురుగా సంచరించేందుకు గానీ పరిస్థితులు అనుకూలంగా లేవన్న మాట వాస్తవం. అయితే.. ఒకప్పుడు రాజు తరుముతుంటే పారిపోయిన పోలీసులు, ఇప్పుడు రాజు వెంట పరిగెడుతున్నారు. పోలీస్ లకి ఆ భయం తో కూడిన పరుగు మాత్రమ్ అప్పుడూ తప్పలేదు. ఇప్పుడూ తప్పట్లేదు.  మళ్ళీ ఉద్యమ వేడి రగులుకుంది. బ్రిటిష్ సైన్యానికీ, రామరాజు సేన కీ మధ్య కాల్పులూ, ఇరువైపులా రక్తపాతం జరుగుతుంది. అప్పటికి రాజు ఉద్యమం మొదలు పెట్టి సంవత్సరం పూర్తవుతుంది.  వార్తా పత్రికలలో ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణ లో పడింది ప్రభుత్వం. యుద్ధం లో  ఉద్యమకారుల మరణానికి రామరాజే కారణమనీ, మన్యం లో రాజ్యస్థాపన చెయ్యడమే అతని ఉద్దేశ్యమనీ, దీనికీ సహాయనిరాకరణ ఉద్యమానికీ సంబంధం లేదనీ, మన్య ప్రజల ప్రశాంత జీవితాన్ని భంగపరిచినది రామరాజేననీ అప్పటి ఏజన్సీ కమిషనర్ హెప్పెల్ సరికొత్త వాదనలని తీసుకొచ్చాడు.

1923 ఆగస్ట్ 28 న ఆంధ్రపత్రిక లో ప్రచురితమైన కధనం ఇక్కడ. చదవ వచ్చు.  లేదా ఈ కింది పిక్చర్ మీద క్లిక్ చేసి చదవవచ్చు.




 బాస్టియన్ నే రాజు ఉద్యమానికి మూలకారణం అని అయిష్టంగానే ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణదేవీ పేట లో అతని మీద విచారణ మొదలైంది. అన్ని గ్రామాల పెద్దలనీ, మున్సబులనీ సమావేశ పరిచి రాజు ఫితూరీ ని అణగదొక్కడానికి  ప్రభుత్వానికి తోడ్పాటునందివ్వాలనీ, ప్రజలెవ్వరూ ఉద్యమకారులకి సహాయం చెయ్యకూడదనీ ఆదేశించింది. అదే రోజు సాయంత్రం ఆ మున్సబులందరూ, రాజుని కలిసేట్టుగా మాకవరం పొలాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు రాజు ప్రధాన అనుచరుల్లో ఒకడయిన మల్లుదొర.  రాజు పట్ల పూర్తి విశ్వాసాన్ని చూపిన మున్సబులందరూ అతనికి  సాష్టాంగపడి, ఉద్యమానికి సహాయ సహకారాలు అందించేట్టుగా తమ మద్దతు ప్రకటించారు.
ఈ సంఘటన తర్వాతనే రాజు తన ముఖ్య అనుచరుడు మరియూ గాం గంటం దొర తమ్ముడు అయిన "గాం మల్లు దొర" ని తన దళం నుండి శాశ్వతం గా బహిష్కరించాడు. ఉద్యమం మొదలు కాక ముందు నుండీ తన వెన్నంటి ఉన్న మన్యం వీరుడు మల్లుదొర. రాజువెంట అన్నవరం వచ్చిన నలుగురిలో ఒకడు. అతన్ని ఎందుకు వెలివేశాడు?? అంటే.... కారణం వ్యసనాలు. రాజు ఉద్యమం మొదలు పెట్టినప్పుడే తన సేన ఎంత క్రమశిక్షణ గా ఉండాలో, తన సిద్దాంతాలేమిటో స్పష్టం గా తెలియజేశాడు. అయితే రాజు దళం కృష్ణదేవి పేట పోలీస్ స్టేషన్ ని కొట్టిన రోజునా , ఆ తర్వాత కొన్ని సంధర్భాలలో రాజు అనుచరుడి హోదాలో డబ్బులివ్వకుండా మద్యం సేవించడం, సామాగ్రిని ప్రజల నుండి సేకరించడం మొదలైనవి చేశాడు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి ఘటనలే పునరావృతం కావడం తో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్ప లేదు రామరాజు కి. అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించలేదు. ఇదే విధంగా సరయిన కారణం లేకుండా ఒక హిందూ పోలీసు చావు కి కారణమైన గోకిరి ఎర్రేసు ని 15 రోజుల పాటు బహిష్కరించాడు రాజు.

1923 సెప్టెంబరు 17 రాత్రి....
 మల్లుదొర తన స్వగ్రామానికి దగ్గర లో ఉన్న నడింపాలెం లో తన ఉంపుడుగత్తె అయిన "సుమర్ల సింకుబుల్లి" తోఉన్నాడనీ, అతని కోసం మద్యం పట్టుకొచ్చే ఏర్పాట్లు కూడా జరిగాయనీ, నల్లగొండి మున్సబు నుండి సమాచారం రావడం తో కృష్ణదేవీపేటశిబిరం లో ఉన్న అధికారి "కీరన్స్" పోలీసులతో బయలుదేరి వెళ్ళీ మల్లు ఉన్న ఇంటిని చుట్టు ముట్టాడు. మల్లు అటక ఎక్కి ధాన్యం దాచిపెట్టే గరిసె లో దూరాడు. పోలీసులు ఇల్లంతా గాలిస్తూ ఉండగా "జామేదార్ నారాయణ్ కురూప్" గరిసెను కత్తి తో పొడవడం తో గాయమయ్యే సరికి బయటకి రాక తప్పలేదు.  మల్లు వ్యసన పరుడే కావచ్చు కానీ జగమొండి. రాజు తనని బహిష్కరించాడన్న కోపంతో పోలీసులకి రహస్యాలు చెప్పెయ్యలేదు. మల్లుదొరని కృష్ణదేవీపేట పోలీస్ స్టేషన్ లో చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి చావగొట్టారు.  ఆ హింస అక్టోబర్ 4 వరకూ సాగింది. "చనిపోవడానికి సిధ్ధం" అనే అభిప్రాయం మనసు లో ఉండొచ్చుగాక. కానీ హింస కి శరీరం సిద్ధంగా ఉండదు.....  కొన్ని రహస్యాలు బయటకి వచ్చాయి.
అక్టోబర్ 12 న ఒక ప్రకటన వెలువడింది.

"రామరాజు ముఖ్య అనుచరుడు, ఫితూరీ దార్లలో కడు సాహసి, అత్యంత అపాయకరుడు అయిన గాం మల్లుదొర పట్టుబడ్డాడు. కొత్త పధ్ధతులతోనూ, అవిరళ కృషీ వల్లనూ సెప్టెంబరు 18 , 1923వ సంవత్సరం లో వాస్తవమైన ఈ విజయం సాధించడమైనది"


మల్లుదొర దొరికిపోయినంత మాత్రాన ఉద్యమం ఆగదనీ, తమ పంధాలో మార్పుండబోదనీ గంటందొర  ప్రకటించాడు.
సెప్టెంబర్ 29 న రాజు పాడేరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. కేవలం నాలుగు తుపాకులు లభించాయి.
పోలీసుల కోసం వస్తున్న సామగ్రి, ఆహార పధార్ధాలపై రాజు దళం దాడులు మాత్రం కొనసాగుతున్నాయ్.
కాల్పులు కొనసాగుతున్నాయ్.
శిక్షా సుంకాలు విధించినా, పెంచినా, బెదిరించినా ప్రజల్లో రాజుకున్న పలుకుబడి తగ్గటం లేదు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడింది తెల్లసేన.
 ***************************************************************************
1923 అక్టోబర్ 25

గూడెం లో "హ్యూమ్" నేతృత్వం లో ఏర్పాటు చెయ్యబడిన పోలీస్ సైనిక శిబిరం ఉద్యమ విస్తృతికి ప్రధాన ఆటంకం గా మారడం తో ఆయుధాల కోసం శిబిరం పై దాడి చెయ్యాలని తలచాడు రాజు. రాజు పధకాలు ఎంత పక్కాగా ఉంటాయో చెప్పడానికి మరొక ఉదాహరణ ఇది.
ఆ రోజు రాత్రి సైనిక శిబిరం లో దాదాపు అందరూ నిద్రపోతున్న సమయం. రాజుదళం శిబిరం దగ్గరకి చేరుకుంది. తన సేన ని మొత్తం నాలుగు బృందాలు గా విభజించాడు రాజు. మొదటి బృందం శిబిరం వెనుక భాగం గుండా ప్రవేశించి ఆయుధాలు సేకరించాలి. రెండవ బృందం సాయుధులది. రాజు ఆదేశం ఇవ్వగానే తుపాకులు, బాణాలతో దాడి చెయ్యాలి. మూడవ బృందం లో ఆయుధాలు కాకుండా కేవలం డప్పులూ, డోలులు ఉంటాయ్. నాల్గవ బృందం ఆదేశం ఇచ్చినప్పుడు "మేం కూలోల్లం బాబూ.. మేం కూలోల్లం బాబూ" అని అదే పని గా అరుస్తూ ఉండాలి.
మొదటి బృందం శిబిరం లోకి ప్రవేశించింది. అయితే తుపాకులన్నీ తుపాకి స్టాండ్ కి ఒక ప్రత్యేక పద్ధతి లో అమర్చి ఉండటం తో వాటిని తియ్యడం కొండదళ సభ్యులకి తెలియ లేదు. అంతేకాక ఇలాంటి ప్రమాదాలని నివారించడానికి తుపాకులని అన్ లోడ్ చేసి, తూటాలు తలగడల కింద దాచేసి ఉంచుతున్నారు పోలీసులు. ఇంతలో పోలీసులకి మెలకువ వచ్చి విషయం అర్ధమైపోయింది. ఒక సెంట్రీ కాల్పులు మొదలు పెట్టాడు. వెంటనే రాజు తన బృందాలకి ఆదేశమివ్వటం తో బాణాలూ, తూటాలు శిబిరం లోకి దూసుకురావడం మొదలైంది. అప్పుడే హఠాత్తుగా మొదలైన డప్పుల మోత తో హోరెత్తిపోతుంది. "మేం కూలోల్లం బాబూ.. మేం కూలోల్లం బాబూ" అరుపులతో పోలీసులకి గందరగోళం గా ఉంది. సైనికాధికారులు ఇస్తున్న ఆదేశాలేవీ ఈ గోల లో వినిపించటం లేదు. బ్రిటిష్ సైన్యం ఆయుధాలతో రెడీ అయ్యే సమయానికి కొండదళం పారిపోయింది.ఆయుధాలు దొరకలేదు గానీ, కొండదళం కాల్పులలో "లాన్స్ నాయక్ హుస్సేన్" మరణించాడు.

1923 డిసెంబర్ లో కృష్ణదేవీపేట కి సమీపం లోని కిత్తలోయ లో కొండదళం ఉన్నట్టు తెలిసి పోలీసులు రైడ్ చేశారు. వారికి రాజుబృందం కనిపించ లేదు గానీ ఒక బట్టల మూట, మన్యం మ్యాప్ లభ్యమయ్యాయి. ఎప్పుడు ఎక్కడ కి ఎలా వెళ్ళాలీ? అడవి లో అందరికీ తెలియని అడ్డదారుల గురించిన ఇన్ఫర్మేషన్, పధకాలతో ఉద్యమం నడుస్తుం డటంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఉద్యమం చల్లారినట్టే కనిపిస్తుందీ... ఒకేసారి విశ్వరూప ధరిస్తుంది. ఉద్యమకారుల గెరిల్లా యుద్ధాలతో గుండెలు దడదడలాడుతున్నాయ్.

ఈ స్థితి లో అస్సాం లోని కుకీల తిరుగుబాటుని విజయవంతంగా అణచివేసిన "అస్సాం రైఫిల్స్" దళాలని మన్యానికి రప్పించాలని మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది.  మొదటి ప్రపంచ యుద్ధం లో పని చేసిన అనుభవం ఉన్న "మేజర్ గుడాల్" దీనికి అధిపతి.

సరిగ్గా గుర్తు పెట్టుకోండీ పేరు ని..."మేజర్ గుడాల్"

4 comments:

వేణూశ్రీకాంత్ said...

పీటర్సన్ కి రాసిన లేఖ ప్రతిగా పళ్ళుపంపించడం చాలా బాగుంది. మేజర్ గుడాల్ పేరు గుర్తుపెట్టుకున్నాం :)

Raviteja said...

బాగుంది. మేజర్ గుడాల్ వచ్చి ఎమీ పీక్కుతాదొ చుస్తను

Sravya V said...

హ్మ్ ! ఇంకా ఎంత సేపు గుర్తుంచుకోవాలి ?
btw చిన్న అనుమానం రొట్టెలు తీసుకున్నందుకు పళ్ళు లాగా , పోలీస్ స్టేషన్ లో ఆయుధాల విషయం లో ఏదన్న ఎందుకు వదలలేదా అని ?

రాజ్ కుమార్ said...

వేణూజీ, రవితేజా.. ధన్యవాదాలు.. చూద్దాం ఏం జరుగుతాదో...

శ్రావ్యగారూ...మీకు రిప్లై ఇవ్వకుండానే నెక్స్ట్ పార్ట్ వేసేశా ;) పోలీస్ స్టేషన్ లో ఆయుధాలు తీసుకున్నట్టు గా సంతకం చేసిన ఉత్తరం, బోలెడంత భయం, వదిలి వెళ్ళాడు ;);)
ధన్యవాదాలు